ఆర్టీసీ కార్మికుల బాటలో క్యాబ్ డ్రైవర్లు.. 19 నుంచి నిరవధిక సమ్మె.. డిమాండ్లు ఇవే..!
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ కొంతమేర స్థంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకొర బస్సులు ఒకవైపు.. కండక్టర్లు అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఛార్జీలు మరోవైపు.. వెరసి సగటు జీవులకు తిప్పలు తప్పడం లేదు. అదలావుంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె బాటలో క్యాబ్ డ్రైవర్లు సై అంటుండటంతో నగర వాసుల ప్రయాణం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇటీవల కాలంలో చాలామంది క్యాబ్ల వినియోగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో క్యాబ్ డ్రైవర్ల సమ్మె నగర వాసుల ప్రయాణాన్ని మరింత జఠిలం చేయనుందనే టాక్ వినిపిస్తోంది.
క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాటలో..!
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రం రణరంగంలా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్రమంతటా కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి మద్దతుగా పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించి అండగా నిలబడుతున్నాయి. సమ్మె కారణంగా ఇప్పటికే బస్సులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మె బాట పట్టనుండటం చర్చానీయాంశమైంది.
ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం.. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అరెస్ట్..!
19 నుంచి నిరవధిక సమ్మె..!
ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ నేతలు. ఆ క్రమంలో హైదరాబాద్ రవాణా వ్యవస్థలో అంతో ఇంతో సేవలు అందిస్తున్న క్యాబ్లకు బ్రేకులు పడనున్నాయి. దాంతో నగర వాసులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేదు. నగరంలో ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఆయా కంపెనీల్లో పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవారు సొంత కార్లు ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా క్యాబ్ల పైనే ఆధారపడుతున్నారు. దాంతో క్యాబ్ సర్వీసులకు బాగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కూడా క్యాబ్లు వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగితే చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే సమ్మె బాట.. ఇవే ప్రధాన డిమాండ్లు
న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధన కోసం సమ్మె తప్పేలా లేదంటున్నారు క్యాబ్ జేఏసీ నేతలు. కిలోమీటర్కు ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తం కాకుండా దాన్ని 22 రూపాయలకు పెంచాలని.. ప్రభుత్వమే మొబైల్ యాప్ ఏర్పాటు చేయడంతో పాటు మీటర్ విధానం తిరిగి ప్రవేశ పెట్టాలని.. డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలనేది ప్రధాన డిమాండ్లుగా సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించారు. తమ ప్రతిపాదనలకు ప్రభుత్వం దిగి రాని పక్షంలో సమ్మె అనివార్యమని జేఏసీ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్, కన్వీనర్ ఈశ్వర్ రావు, కో ఛైర్మన్ వెంకటేశం హెచ్చరించారు. ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న క్యాబ్లకు సంబంధించి జీవోలు 61, 66 అమలు చేయాలని కోరారు.
ఉబెర్, ఓలా డ్రైవర్లు కూడా సై..!
తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు సై అంటున్నారు. ఆ క్రమంలో ఈ నెల 19 నుంచి తలపెట్టిన సమ్మెలో భాగస్వాములం అవుతామని ప్రకటించారు. దాంతో నగరంలో క్యాబ్ సేవలకు బ్రేకులు పడనున్నాయి. క్యాబ్ నిర్వహణ సంస్థలు పెద్ద ఎత్తున వాహనాలను లీజుకు తీసుకుంటుండటంతో డ్రైవర్ల ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. క్యాబ్లు నడిపితే అధిక ఆదాయం వస్తుందన్న ఆశతో చాలామంది ఫైనాన్స్లో అప్పు తీసుకుని మరీ కార్లు కొన్నారు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యారు. అందుకే ప్రతి డ్రైవర్కు మినిమం బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలనేది జేఏసీ నేతల డిమాండ్.
ఆర్టీసీని నడపడం చేతకాదా.. నాకు అప్పగిస్తే లాభాలు చూపిస్తా : ప్రొఫెసర్ నాగేశ్వర్
50 వేల క్యాబ్లకు బ్రేక్ పడే ఛాన్స్.. 5 లక్షల మందికి కష్టాలే..!
ట్యాక్సీ డ్రైవర్ల సమ్మె కారణంగా హైదరాబాద్లో దాదాపు 50 వేల క్యాబ్లకు బ్రేకులు పడనున్నాయి. ఆ క్రమంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడతారనేది ఓ అంచనా. ఇక జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రతి నిత్యం వచ్చే దాదాపు 5 వేలకు పైగా ట్యాక్సీలు కూడా నడవలేని పరిస్థితి. అదలావుంటే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సైతం అంటూ ప్రకటించారు ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ నేతలు.