TSRTC STRIKE : ఆర్టీసీ కార్మికులకు సర్కార్ షాక్.. జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని కోర్టుకు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత పెరిగింది. రోజుకో రకంగా ఆందోళన ఉధృతం చేస్తున్నా ప్రభుత్వ వైఖరి ఏ మాత్రం మారటం లేదు. మరో పక్క కోర్టు చర్చలు జరపాలని, సెప్టెంబర్ నెల జీతాలు సోమవారంలోగా చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే నేడు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై జరిగిన విచారణలో ఆర్టీసీ నష్టాలలో ఉందని, ఆర్టీసీలో జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పటం ఆర్టీసీ కార్మికులను షాక్ కు గురి చేసింది.
ఆర్టీసీ సమ్మె: కల్వకుంట్ల కుటుంబానికి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కుటుంబాల శాపం.. యాష్కీ
ఆర్టీసీ కార్మిక సమ్మె ఉద్రిక్తం .. నిర్ణయం మార్చుకోని సర్కార్
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా తెలంగాణా సర్కార్ మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడినట్టు కనిపిస్తుంది. ఇక ఒకపక్క ఆర్టీసీ కార్మికులకు అండగా రాష్ట్రంలోని విద్యార్థి, ప్రజా సంఘాలు, రెవెన్యూ, తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, టీఎన్జీవోలు మద్దతు తెలుపుతున్నారు. 19న బంద్ నిర్వహించారు. ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు.ఇక 30వ తేదీన 5 లక్షల మందితో ఉస్మానియా యూనివర్సిటీలో సకల జనుల సమర భేరి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
జీతాలు చెల్లింపుపై కోర్టులో వాదనలు.. ఆర్టీసీ కార్పోరేషన్లో నిధులు లేవన్న ప్రభుత్వం
ఇక సోమవారం వరకు ఆర్టీసీ కార్మికుల జీతాలను ఇవ్వాలని, మొండితనం మంచిది కాదని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. కార్మికులు సమ్మె చేపట్టడంతో గత నెల జీతాలు కూడా ఇప్పటివరకు కార్మికులకు అందలేదు. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు నెలకొన్నాయి. అయితే ఈ నెల 21వ తేదీ లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలని హైకోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై నేడు హైకోర్ట్లో విచారణ జరిగింది. ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుకు 224 కోట్లు కావాలని హైకోర్టు ధర్మాసనానికి తెలిపిన ప్రభుత్వం అరపు న్యాయవాది ప్రస్తుతం ఆర్టీసీ కార్పోరేషన్లో కేవలం 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని కోర్ట్కు తెలిపారు.
కుంటి సాకులు చెప్తుందని కార్మికుల ఆగ్రహం .. షాక్ లో ఆర్టీసీ కార్మికులు
ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా హైకోర్టుకు చెప్తున్న విషయంపై మండిపడ్డ కార్మికులు నష్టాల సాకు చెప్పి ప్రభుత్వం ఆర్టీసీని విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని పేర్కొన్నారు. నిధులు లేవని జీతాలు ఇవ్వలేము అని చెప్తున్న ప్రభుత్వం విధుల్లో ఉంటె నిధులు లేకున్నా జీతాలు ఎలా ఇస్తారో అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే కుంటి సాకులు చెప్తున్నారని, ఆరేళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని, కావాలనే కోర్ట్కు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని మండిపడుతున్నారు.
ఈ నెల 29వ తేదీకి విచారణ వాయిదా ... ఉసూరుమంటున్న కార్మికులు
ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం అని ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ వాదించారు. ఇక పని చేసిన నెల జీతం ఇవ్వకపోవటం చట్ట విరుద్ధం అని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇక నేడు కోర్టులో ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం మరోమారు ఈ కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. దీంతో నేడు కోర్టు ఆదేశాల మేరకు కార్మికుల ఖాతాల్లో పడతాయనుకున్న జీతం డబ్బులు పడలేదు. దీంతో కార్మిక కుటుంబాలు నిరాశ చెందుతున్నాయి.