TSRTC STRIKE:హైకోర్టు విచారణ, ముగిసిన కార్మికుల గడువు, మిగతా రూట్లపై కేసీఆర్ సమీక్ష
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతుండటంతో.. ఆర్టీసీ మెర్జ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టీ మరీ చెప్తున్నారు. దీంతో హైకోర్టులో కేసు విచారణ జరగడంతో.. ఇరువర్గాలు తమ వాదనలతో సిద్ధంగా ఉన్నాయి. గురువారం హైకోర్టులో విచారణ రానుండగా.. బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. హైకోర్టు విచారణతోపాటు విధుల్లో చేరేందుకు కార్మికులకు ఇచ్చిన గడువు ముగియడంతో ప్రభుత్వం అవలంభించాల్సిన కార్యాచరణపై చర్చించారు.
ఏం చేద్దాం
ప్రైవేట్ ఆపరేటర్లకు ఆర్టీసీలో ఎలా అనుమతులు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. దాదాపు 9 గంటల పాటు డిస్కష్ చేశారు. ప్రైవేట్ ఆపరేటర్లకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇచ్చేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులను అధ్యయనం చేయాలని కూడా కోరారు. దీంతోపాటు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవానలి స్పష్టంచేశారు. ఆర్టీసీ సమ్మెపై గురువారం కోర్టు విచారణ తర్వాత.. తమ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
మిగతా రూట్లు కూడా..
రాష్ట్రంలో 5100 ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగతా రూట్లను కూడా ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తామని తెలిపారు. ప్రధానంగా వీటిపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఎన్ని రూట్లు..
ప్రైవేట్ బస్సులకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందున.. విధివిధానాలు, కొత్తగా ఎన్నిరూట్లలో ప్రైవేట్ బస్సులను అనుమతివ్వాలనే అంశంపై అధికారులను సీఎం ఆరా తీశారు. సమ్మె కొనసాగుతున్నందున ప్రత్యామ్నాయా ఏర్పాట్లను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు.
విలీనమే ప్రధానం
ప్రభుత్వం తమ డిమాండ్లు తీర్చేవరకు సమ్మె విరమించేది లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి పేర్కొన్నారు. తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ బకాయి ఎందుకు ఇప్పించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీకి రూ.5 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతారే తప్ప సంస్థను సంరక్షించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.