టీఎస్ఆర్టీసీ సమ్మె, హైకోర్టు కీలక ఉత్తర్వులు.. సీఎస్తో పాటు ఉన్నతాధికారులు కోర్టుకు ..
ఆర్టీసీ సమ్మెపై సమగ్ర విచారణ జరిపేందుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గత నెలరోజులుగా జరుగుతున్న సమ్మెకు కోర్టుపరంగా ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై పూర్తి వివరాలను తీసుకుని విచారణ జరిపేందుకు సిద్దమయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులు కోర్టుకు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
సీఎస్ ఇతర ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులు
ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు అధికారులకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సమచారంతో సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్శర్శ ,ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుతోపాటు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్కుమార్లు ఈ నెల ఏడవ తేదిన కోర్టులో హజరు కావాలని అదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆయా విభాగాలు కోర్టుకు సమర్పించిన నివేదికలు విరుద్దంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పూర్తివాస్తవాలను ఈనెల ఆరవతేదీల్లోగా సమర్పించాలని ఆదేశించింది.
వాస్తవానికి విరుద్దంగా నివేదికలు
ఆర్టీసీ సమ్మెపై నవంబర్ 1న జరిగిన విచారణలో ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్ను దాఖలు చేశారని హైకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలోనే విచారణ సమయంలో కూడ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సునిల్ శర్మ ఇచ్చి నివేదికలో వాస్తవాలకు విరుద్దంగా ఉన్నాయని కోర్టు తెలిపింది. దీంతో పాటు రవాణాశాఖ మంత్రికి ఆర్టీసీ ఇచ్చిన నివేదిక కూడ ఇందుకు విరుద్దగా ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదిలోగా సమగ్ర సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని సునిల్ శర్మను ఆదేశించింది.
బకాయిలపై వివరణ
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కూడ సమాచారం కూడ అసమగ్రంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే 2014 నుండి గత నెల వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన వివరాలు ఇవ్వాలని కోరింది. మరోవైపు ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎంత బకాయిపడిందో వివరాలు తెలపాలని కోరింది. ఈ సంవత్సరం బకాయిలను చెల్లించాలని జీహెచ్ఎంసీని కోరిందా..లేకుండా ఎందుకు అడగలేదో వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలోనే మరోసారి ఈనెల 7వ తేదిన సమగ్ర విచారణ జరపనుంది.