ఆర్టీసీ కార్మికులకు పోలీస్ బాస్ వార్నింగ్..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం (22.10.2019) నాటితో 18వ రోజుకు చేరింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోననే సిట్యువేషన్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఇచ్చిన వార్నింగ్ చర్చానీయాంశమైంది.
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాత్కాలిక సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. ఆ క్రమంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆయా రూట్లలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కార్మికుల నిరసనలో భాగంగా తాత్కాలిక సిబ్బందిపై చేయి చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. జేబీఎస్ దగ్గర వంటావార్పు.. వినతి పత్రాలు, పూలతో నిరసన..!
ప్రయాణీకులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతోంది గవర్నమెంట్. ఆ క్రమంలో వారిపై ఆర్టీసీ కార్మికులు దాడులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీపీ అంజనీ కుమార్. మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్టీసీకి చెందిన బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న వారిని గానీ, ప్రైవేట్ వాహనాలు నడుపుతున్న మిగతా సిబ్బందిని గానీ అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాత్కాలిక సిబ్బందిపై సమ్మె చేస్తున్న కార్మికులు దాడి చేయడం సరికాదని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే విచారణ జరిపి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.