ఆర్టీసీ సమ్మె చరిత్రాత్మకం.. 25 రోజులుగా ఆందోళన పర్వం.. సకల జనభేరికి సన్నద్ధం
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజుకు చేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మె చరిత్రాత్మకంగా నిలవనుంది. 25 రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో కార్మికులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ సమ్మెను మరింత హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం (30.10.2019) నాడు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో సకల జనభేరి పేరిట భారీ బహిరంగ సభకు సన్నద్ధమయ్యారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఇన్ని రోజులుగా సమ్మె జరుగుతున్న తీరు దేశ చరిత్రలో రికార్డు సృష్టించనుంది.
రోజురోజుకీ ఉధృతంగా ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5వ తేదీన యాభై వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. అయితే బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి సమ్మెకు పోవడం సరికాదనేది ప్రభుత్వ వాదన. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 25వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు. మరోవైపు హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో సమ్మె నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మొట్టికాయలు వేస్తోంది న్యాయస్థానం. సోమవారం (28.10.2019) నాడు విచారణ సందర్భంగా కూడా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది.
ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
సమ్మె నివారణకు చర్యలేవీ.. కార్మికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఇబ్బందులు తప్పడం లేదు. తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నప్పటికీ.. నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో జనాల నుంచి ఆర్టీసీకి చేదు అనుభవం ఎదురవుతోంది. కొన్నిచోట్ల బస్సులపై దాడులు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అదలావుంటే ఉద్యోగ భద్రతపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం.. పోయిన నెల జీతాలు చెల్లించకపోవడం.. తదితర కారణాలతో కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సమ్మె నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కొకొల్లలు.
25వ రోజుకు సమ్మె.. చరిత్రలో రికార్డు?
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం (29.10.2019) నాటికి 25వ రోజుకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. వివిధ రూపాల్లో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులుగా చేస్తున్న సమ్మె చారిత్రాత్మకం కానుంది. ఇదే పెద్ద సమ్మెగా రికార్డు నమోదు చేయనుంది. ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో జరిగిన సకల జనుల సమ్మెకు ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు మద్దతుగా నిలిచారు. అయితే తమ డిమాండ్ల సాధన కోసం జరిగిన సమ్మెల్లో మాత్రం ఈసారి జరుగుతుందే పెద్దదని తెలుస్తోంది.
ఇద్దరు ప్రియులు, తల్లి హత్య.. హయత్ నగర్ కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగు చూసిన నిజాలు..!
అప్పుడు 24 రోజులు.. ఈసారి 25 రోజులు దాటి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీ కార్మికులు ఒకసారి పెద్ద ఎత్తున సమ్మె చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీ పరిరక్షణ - వేతన సవరణ డిమాండ్తో సమ్మె జరిగింది. అప్పుడు 24 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అదలావుంటే అప్పుడెప్పుడో 1960 దశకంలో 20 రోజుల పాటు సమ్మె చేసినట్లు తెలుస్తోంది. ఈసారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం (29.10.2019) నాటికి 25 రోజులు అవుతోంది. దాంతో ఈ సమ్మె చారిత్రాత్మకం కానుందనే టాక్ వినిపిస్తోంది.