ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్లో అపర చాణక్యుడు..!
హైదరాబాద్ : ఆనాడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్.. ఈనాడేమో కేసీఆర్. అందరిదీ అదే దారి. సీఎం హోదాలో ఈ ముగ్గురి తీరు వివాదస్పదమే. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడిది ఐతే.. నిరుపేదల గుండెల్లో బుల్లెట్లు దించిన తీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అదే క్రమంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా చేరారనే ప్రచారం జోరందుకుంది. ఎలాంటి సమస్యనైనా, ఏ విషయమైనా చిటికెలో తేల్చే స్వభావమున్న కేసీఆర్ ఎక్కడ తప్పటడుగు వేస్తున్నారనేది చర్చానీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకున్నప్పటికీ.. ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం మెట్టు దిగకపోవడంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
కేసీఆర్ గుండెల్లో భయం పుట్టాలి.. అహంకారం తగ్గి ప్రజల కోసం పనిచేయాలి.. రేవంత్ రెడ్డి అటాక్..!
ప్రజా ఉద్యమాలను అణగదొక్కాలని చూస్తే..!
ప్రజా ఉద్యమాలను అణగదొక్కాలని చూస్తే అసలుకే ఎసరు వస్తుందనే విషయం చరిత్ర పుటలు వెతికితే కనిపిస్తుంది. గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే కూడా ఇదే విషయం చెబుతుంది. ఒక అంశం ఆందోళన రూపం దాల్చేంత వరకు వచ్చిందంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. నిరసనల రూపంలో పెల్లుబుకిందంటే బాధితులకు ఎంత బాధ ఉంటే అలాంటి పరిస్థితులకు దారి తీసిందో తెలిసిపోతుంది. విద్యార్థి, కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు చేపట్టే ఆందోళనలకు ప్రజల మద్దతు ఉంటుందనే విషయం చాలా సందర్భాల్లో బయటపడింది. ఆ క్రమంలో ప్రభుత్వాలు పోలీసులను ఉసిగొల్పి, నిరసనకారులపై తుపాకులు ఎక్కుపెట్టిస్తే అధికారం నుంచి దించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఆనాడు చంద్రబాబు అలా చేస్తే.. వైఎస్ఆర్, కేసీఆర్ వ్యతిరేకించి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల అవలంభించిన తీరు ఆయనకు మైనస్ పాయింట్గా మారింది. విద్యుత్ కోతలకు తోడు అడ్డగోలుగా పెంచిన బిల్లులపై నిరసన తెలుపుతూ ఛలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమం తలపెట్టిన రైతులపై తుపాకులు ఎక్కుపెట్టించారు. ఆ క్రమంలో 2000, ఆగస్టు 28వ తేదీన బషీర్బాగ్ ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడంతో ఆనాడు చంద్రబాబు నాయుడి తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్, అప్పటి టీడీపీ నేతగా కేసీఆర్ చంద్రబాబు తీరును ఎండగట్టారు.
చంద్రబాబు తప్పిదం.. వైఎస్ఆర్కు వరం..!
చంద్రబాబు అంటే బషీర్ బాగ్ కాల్పులు.. బషీర్ బాగ్ కాల్పులు అంటే చంద్రబాబు అనేలా ఇప్పటికీ ఆనాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అయితే బషీర్ బాగ్ కాల్పుల నేపథ్యం చంద్రబాబును దెబ్బకొట్టింది. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కూడా తెలుగుదేశం విజయావకాశాలను ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. 2003లో మండువేసవిలో ఆయన చేపట్టిన పాదయాత్రకు తోడు ఉచిత విద్యుత్ హామీ వైఎస్ఆర్కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాయి. రైతులపై చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపించి.. ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూడటమే టీడీపీకి మరోసారి అధికార పీఠం దక్కలేదన్నది సుస్పష్టం.
రాజశేఖర్ రెడ్డిని వెంటాడిన ప్రజా ఉద్యమం.. ముదిగొండ కాల్పుల్లో ఏడుగురు మృతి..!
2000 సంవత్సరంలో చంద్రబాబు తీరును వ్యతిరేకించి 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా ప్రజా ఉద్యమం వెంటాడింది. 2007లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముదిగొండ కాల్పులు వైఎస్ఆర్కు ఒక మచ్చను మిగిల్చాయి. జానెడు జాగా కావాలంటూ స్థలాల కోసం నిరుపేదలు గొంతెత్తితే.. వైఎస్ఆర్ పోలీసులను ఉసిగొల్పి కాల్పులకు ఆదేశించారనే ముద్ర పడింది. ఆ ఘటనలో ఖాకీలు రెచ్చిపోయి విచక్షణారహితంగా కాల్పులు జరిపితే ఏడుగురు మృతి చెందారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అపరచాణక్యుడు ఇప్పుడు ఇలా..!
ఇప్పటివరకు సీఎం కేసీఆర్ అంటే రాజకీయాల్లో అపర చాణక్యుడనే ముద్ర పడింది. తన వాగ్ధాటితో ఎదుటివారిని ఒప్పించగల సత్తా ఉంది. ఉద్యమ నేతగా గళం విప్పితే కోట్లాది మంది వెన్నంటి నడిచిన ఘనత ఆయన సొంతం. అలాంటిది ఆర్టీసీ కార్మికులతో కూర్చుని ఏదో ఒకటి మాట్లాడి సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తే సరిపోయేది కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్లతో చర్చల్లేవ్ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిచండం సరికాదనే కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆర్టీసీ సమ్మె.. తెలంగాణ బంద్.. చివరకు కేసీఆర్ నిర్ణయమేంటో..!
ఈ నెల 19వ తేదీన ఆర్టీసీ కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ సందర్భంగా రాష్ట్రమంతటా నిరసనలు మిన్నంటాయి. కార్మికులను ఈడ్చుకెళ్లడం.. పలువురికి గాయాలు కావడం.. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం.. ఇవన్నీ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తాయనే వాదనలు లేకపోలేదు.
అదలావుంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చివరకు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతుండటం.. కోర్టు కూడా మొట్టికాయలు వేస్తుండటంతో కేసీఆర్ ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననేది చర్చానీయాంశమైంది.