'ఆస్తులపై కేసీఆర్ కన్ను': ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్బండ్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు ఛేదించి...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు ఇచ్చిన చలో ట్యాంక్బండ్ శనివారం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాదులోని బీఆర్కే భవన్ వద్ద గుమికూడిన కార్మికులు ఒక్కసారిగా పోలీసు వలయాన్ని ఛేదించుకొని ట్యాంకు బండ్ వైపుకు దూసుకు వచ్చారు. బారీకేడ్లు, కంచెలు దూకి ట్యాంక్ బండ్ మీదుగా మహిళా కార్మికులు దూసుకెళ్లారు. పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్యన తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు వందలాది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్ తరలించారు.
అనుమతించని పోలీసులు.. ఎక్కడికి అక్కడ అరెస్టులు
మరికొందరు కార్మికులు ఎంబీ భవన్ నుంచి ట్యాంక్ బండ్కు ప్రదర్శనగా వెళ్లారు. తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, విమలక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ర్యాలీగా వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చలో ట్యాంక్ బండ్తో సకల జనుల సామూహిక దీక్షకు ఆర్టీసీ జేఏసీ ప్లాన్ చేసింది. అయితే పోలీసులు దీనిని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పలువురు ఆర్టీసీ కార్మికులు పోలీసుల ఆంక్షలు చేరుకొని వెళ్లి, ట్యాంక్ బండ్ పైన బైఠాయించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో అశ్వత్థామ రెడ్డి
ఆర్టీసీ కార్మికులు, కార్మిక నేతలను పోలీసులు ముందు నుండే ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు జేఏసీ నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాదులో వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
కోట్లాది రూపాయల ఆస్తులపై కేసీఆర్ కన్ను
హైదరాబాదుతో పాటు వివిధ జిల్లాల్లోను ముందస్తు అరెస్టులు జరిగాయి. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీకి చెందిన కోట్లాది ఆస్తులపై కేసీఆర్ కన్నేశారని, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఆర్టీసీ వనరులను పంచిపెట్టేందుకు సంస్థలను నిర్వీర్యం చేశారని చిన్నారెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యను ఒక రాచరిక దృష్టితో చూడకుండా ప్రజాస్వామ్యంగా ఆలోచించి పరిష్కరించాలని హితవు పలికారు.