ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం.. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అరెస్ట్..!
Recommended Video
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెను నిర్వీర్యం చేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అలజడి రేపింది. ఈ నెల 19వ తేదీన (శనివారం) తలపెట్టిన తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు.
అశ్వత్థామ రెడ్డి అరెస్ట్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తుంటే తమ నాయకుడిని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన శనివారం నాటి తెలంగాణ బంద్ను ఆరు నూరైనా విజయవంతం చేస్తామంటున్నారు. ఆ మేరకు ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతివ్వాలని మరోసారి కోరారు.
కేసీఆర్ సభకు కాంగ్రెస్ విన్నింగ్కు లింక్ ఉందా.. గెలుపుపై ధీమా మరింత పెరిగిందా..?
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం (18.10.2019) నాటితో 14వ రోజుకు చేరింది. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు, నిరసనలతో సమ్మెను హీటెక్కిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. కార్మిక సంఘాలతో మాటల్లేవ్, చర్చల్లేవ్ అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అగ్నికి ఆజ్యం తోడయినట్లు తయారైంది సమ్మె పరిస్థితి. దాంతో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలతో భగ్గుమంటున్నారు కార్మికులు.