ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప మేధావా.. ఆనాడు ప్రభుత్వం కూలిపోలేదా : అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటితో 13వ రోజుకు చేరింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమ్మెను మరింత హీటెక్కిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపబోదని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జేఏసీ నేతలు భగ్గుమంటున్నారు. ఆ క్రమంలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కేసీఆర్పై మరోసారి ఫైరయ్యారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అశ్వత్థామ రెడ్డి. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలు లెవనెత్తారు. సీఎం పదవి శాశ్వతం కాదని.. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారని.. ఆ విషయం కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారని.. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. 1993-94 మధ్య కాలంలో జరిగిన సంక్షోభాన్ని కేసీఆర్ మరిచిపోవద్దని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప మేధావా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీఎం రాకపాయే.. ఆర్టీసీ సమ్మెపై ఏం మాట్లాడకపాయే.. కేసీఆర్ సభకు వరుణిడి బ్రేక్..! మరి ఆనాడు..!!
ఈ సందర్భంగా పలువురు మంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ మేధావులు మౌనంగా ఉండొద్దని సూచించారు. ఆర్టీసీ సమ్మె ఇంత ఉధృతంగా జరుగుతుంటే మంత్రులు ఈటల, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి మౌనం వహించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కొందరు మంత్రులు కేసీఆర్ చెప్పినట్లు విని కార్మికులపై ఆరోపణలు చేస్తూ ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మాట్లాడుతున్నారని.. ఒకవేళ ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించేలా దారి దొరక్కుంటే 1994 నాటి సంక్షోభం తప్పదన్నట్లుగా హెచ్చరించారు అశ్వత్థామ రెడ్డి. ప్రజాస్వామ్య పునాదులు కదులుతున్నాయని వ్యాఖ్యానించారు. హైకోర్టు మొండి వైఖరి వీడి హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము ఎప్పటికీ సిద్ధమేనని మరోసారి స్పష్టం చేశారు.