ఆర్టీసీ పరిరక్షణ.. సకల జనభేరి సభ.. పోటెత్తిన కార్మికులు, నేతలు..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు మేరకు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో "ఆర్టీసీ పరిరక్షణకై సకల జనభేరి సభ" నిర్వహిస్తున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సభ ప్రారంభమైంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగితే ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని మండిపడుతున్న కార్మికులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. అంతేకాదు కుటుంబ సభ్యులను కూడా ఈ సభలో భాగస్వాములను చేశారు.
సరూర్నగర్ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్టీసీ పరిరక్షణకై సకల జనభేరి సభకు ఆయా పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆ మేరకు వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డితో పాటు విమలక్క, బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి.. బీసీ సంఘం రాష్ట్ర నేత జాజుల శ్రీనివాస్ గౌడ్.. సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.. కాంగ్రెస్ లీడర్ వీహెచ్.. టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్.రమణ.. సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి తదితరులు సభకు హాజరయ్యారు. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకే సభ నిర్వహణకు హైకోర్టు అనుమతించింది.
శివసేనతోనే ప్రభుత్వ ఏర్పాటు.. విభేదాలు లేవు.. అభిప్రాయ భేదాలే : ఫడ్నవీస్
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలంటూ కొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే సమ్మెను మరింత ఉధృతం చేసే చర్యల్లో భాగంగా.. సరూర్నగర్ స్టేడియంలో జనభేరి సభ నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. చరిత్రలో ఇంతవరకు ఇన్ని రోజులు సమ్మె జరిగిన దాఖలాలు లేవు. ఇదే అతిపెద్ద సమ్మెగా నిలిచిపోనుంది. ఉమ్మడి ఏపీలో ఇలాగే ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగడంతో 24 రోజుల పాటు సమ్మె సాగింది. ఇక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా అన్ని శాఖల ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా 27 రోజుల పాటు నిరసన పర్వంలో పాలు పంచుకున్నారు. అయితే అది కార్మికుల డిమాండ్ల సాధనలో భాగంగా జరిగిన సమ్మె కాదు కాబట్టి అది లెక్కలోకి రాదు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి చేపట్టిన సమ్మె 26 రోజులుగా కొనసాగుతుండటం గమనార్హం.