TSRTC STRIKE:జేఏసీ నేతల దీక్ష విరమణ, నిమ్మరసం ఇచ్చిన కోదండరాం, సడక్ బంద్ వాయిదా...
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్, కో-కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి దీక్ష విరమించారు. కానీ తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని వారు స్పష్టంచేశారు. దీక్షకు బ్రేక్ ఇస్తున్నామని.. సమ్మె మాత్రం యాధాతధంగా కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డికు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
దీక్ష విరమణ..
తమ డిమాండ్లను పరిష్కరించాలని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి గత మూడురోజుల నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఇంటి వద్ద దీక్ష చేస్తుండగా పోలీసులు ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్యం విషమిస్తుందని వైద్యులు చెప్పడంతో అఖిలపక్ష నేతలు సమావేశమై చర్చించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో దీక్ష విరమింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమ్మె మాత్రం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
సడక్ బంద్ వాయిదా
హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం చేపట్టాల్సిన సడక్ బంద్ కూడా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాస్తారోకో కూడా వాయిదా వేశామని చెప్పారు. కానీ ఆయా డిపోల వద్ద కార్మికులు నిరసన తెలియజేయాలని సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు. కోర్టు కాపీ అందలేదని అశ్వత్ధామరెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం అన్ని కేంద్ర కమిటీలు సమావేశమై కోర్టు తీర్పును చర్చిస్తామని తెలిపారు. సాయంత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలియజేస్తామని చెప్పారు.
తీర్పు నేపథ్యంలో..
గత 45 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టు తీర్పు చెప్పింది. సమ్మె ఇల్లిగల్ అని స్పష్టంచేసింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించింది. సమస్యలపై రెండువారాల్లోగా లేబర్ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని కూడా సూచించింది. ఆయా అంశాలపై ప్రభుత్వం ముందుకొచ్చి తమ వైఖరి తెలియజేస్తే.. తాము కూడా చర్చలు జరిపేందుకు ఓకే అని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టంచేశారు.
దొంగలమా..?
తాము నిరవధిక దీక్ష చేస్తుంటే పోలీసులు తమను దొంగల్లా ట్రీట్ చేశారని జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఇంట్లో దీక్ష చేస్తున్న తనను పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించారు. తన భార్య, పిల్లలు, బంధువులను కూడా అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసుల తీరు బాధ కలిగించిందని చెప్పారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని అనలేదని.. ఇది పోలీసుల చేత ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం అని విమర్శించారు.