తెలంగాణ బంద్: 21 తర్వాత ఉవ్వెత్తున ఉద్యమం, ప్రభుత్వం మెడలు వంచుతాం..
తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం మినమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. సమ్మె గురించి చర్చలు జరుపాలని హైకోర్టు సూచించినా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపకపోవడం సరికాదని విమర్శించారు.
గృహనిర్బంధం..
ఆర్టీసీ కార్మికుల బంద్కు జగ్గారెడ్డి మద్దతు తెలిపారు. బంద్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఇంటిలో గృహనిర్బంధం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని జగ్గారెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం హక్కు అని తెలిపారు. తమ హక్కులను కాలరాయడం ఏంటీ అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల నిరసనకు తాము సపోర్ట్ చేస్తున్నట్టు స్పష్టంచేశారు. కాంగ్రెస్, ఇతర పక్షాలు కూడా కార్మికులకు భేషరతుగా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఉప పోరు తర్వాత..
ఈ నెల 21న హుజూర్నగర్ ఉప ఎన్నిక ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. అందుకే సమ్మెలో పాల్గొనలేకపోయారని చెప్పారు. ఎన్నిక తర్వాత ఉత్తమ్ నేతృత్వంలో పోరుబాట పడతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఊరుకోబోమని తేల్చిచెప్పారు.
శ్రీధర్ బాబు, భట్టి కూడా
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క ర్యాలీ తీసి చార్మినార్ వద్ద అరెస్టైన సంగతి తెలిసిందే. వారు కాసేపటి క్రితమే పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క తప్పుపట్టారు. వీరికితో జగ్గారెడ్డి కూడా జతకలిశారు. తమ పార్టీ తరఫున కార్మికుల డిమాండ్ల కోసం పోరాడుతామని స్పష్టంచేశారు.
అల్టిమేటం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ను పరిశీలించాలని జగ్గారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఐఆర్, పీఆర్సీ సహా 26 డిమాండ్లపై కార్మికులకు భరోసా కల్పించాలని కోరారు. లేదంటే ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. సకలజనుల సమ్మెలో 41 రోజులపాటు కార్మికులు చేసిన సమ్మెను గుర్తుచేశారు. ఆనాడు ఉద్యమానికి ఊపుతీసుకొచ్చిందే ఆర్టీసీ కార్మిక సోదరులను పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వారి న్యాయమైన హక్కులపై సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని విమర్శలు గుప్పించారు.