TSRTC Strike: మంచిమనసంటూ కేకేపై విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసలు, కేసీఆర్పై విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న వేళ ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్యలో వారధిలా మారేందుకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ కీలక నేత కే కేశవరావు. పరిస్థితి చేయిదాటక ముందే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కేకే సూచించారు.
కేకే పిలుపునకు సానుకూల స్పందన
కాగా, కేశవరావు ప్రతిపాదన పట్ల అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే తాము చర్చలకు సిద్ధమంటూ ఇప్పటికే ఆర్టీసీ సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇరువర్గాలు కూడా చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ ప్రకటించిన నేపథ్యంలో సమ్మెకు ఓ పరిష్కార మార్గం దొరికే అవకాశం ఏర్పడింది.
కేకేపై కొండా ప్రశంసలు.. కేసీఆర్పై విమర్శలు
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కేశవరావుతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై చర్చించినట్లు తెలిసింది. కేశవరావు చొరవతో కొత్త ఆశలు చిగురించాయని, ఆయన మంచి మనసుతో స్పందించారని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదన కేసీఆర్కు మాత్రం పట్టడం లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు, ప్రభుత్వం, అన్ని వర్గాలకు నష్టం జరుగుతోందని అన్నారు.
నిరంకుశ పాలన..
ఇది టీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం తెచ్చిపెడుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని, పోలీసులతో ప్రజల గొంతును నొక్కుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరిష్కారం చూపాలని కోరారు.
సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని కేకే చెప్పినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఆ ఒక్కటీ మినహా అంటూ కేకే
కాగా, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత అయితే కే కేశవరావు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు తన ప్రకటన ద్వారా పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన మిగితా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే తాను ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు సిద్ధమేని ప్రకటించారు.