ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు: చర్చలకు ప్రభుత్వం సానుకూలం..జేఏసీ సిద్దం: నేటితో పరిష్కారమయ్యేనా..!
Recommended Video
తెలంగాణ ఆర్టీసీ సమ్మె 11వ రోజుకు చేరింది. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాల్లో మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బెట్టు పోయిన ప్రభుత్వం..పరోక్షంగా సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చలకు తాము సిద్దమని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. మరో వైపు కార్మికుల ఆత్మహత్యలు అటు ప్రభుత్వాన్ని..ఇటు కార్మిక సంఘాలను అలజడికి గురి చేస్తున్నాయి. దీంతో..సమస్య పరిష్కారం కోసం ఒక మెట్టు దిగటానికి రెండు వైపుల సంకేతాలు మొదలయ్యాయి.
అయితే..ఇప్పుడు ఆ చర్చల నిర్వహణ బాధ్యత ప్రభుత్వ పరంగానా..లేక రాజకీయంగానా అనే సందిగ్దత కొనసాగుతోంది. అధికార పార్టీ సీనియర్ నేత కేకే చేసిన ప్రతిపాదన కు కార్మిక సంఘాలు సరే అన్నాయి. మరో వైపు రాజకీయంగానూ ఈ అంశం కారణంగా అధికార పార్టీకి ఇబ్బందులు మొదలయ్యామి. హైకోర్టులో నేడు సమ్మె పైన కేసు మరోసారి విచారణకు రానుంది. దీంతో..ఈ రోజు ఆర్టీసీ సమ్మె కీలక మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
రాజభవన్ 'కోర్టు’కు ఆర్టీసీ సమ్మె.. గవర్నర్ తమిళి సై నిర్ణయంపైనే ఉత్కంఠ
ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు..
ఆర్టీసీ సమ్మె ప్రారంభం రోజు..ఇప్పటికీ చూస్తుంటే ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కార్మికుల ఆత్మ హత్యలతో ఇంకా ఈ సమస్యను కొనసాగించటం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో..ప్రభుత్వం సైతం పైకి బెట్టు వీడినట్లు కనపడకుండా.. సమ్మె పరిష్కారం దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తమ పార్టీ నేత కేకే ద్వారా చర్చలకు సానుకూలమనే అభిప్రాయం కిలిగించింది. అయితే..కేకే మాత్రం ముఖ్యమంత్రి చెబితేనే చర్చలు నిర్వహిస్తానని తేల్చి చెప్పారు. మరో వైపు తాము చర్చలకు సిద్దమని కార్మిక సంఘాలు స్పష్టం చేసిన సమయంలో ప్రభుత్వం చర్చలు చేయకపోతే.. ప్రభుత్వం మీదనే నెపం పడే అవకాశం ఉంటుంది. దీంతో..మధ్యే మార్గంగా ఈ రోజు సమ్మెలో కొత్త మలుపు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఆ ఒక్కటి మినహా.. అంతా ఓకే నంటూ..
కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ పైన మాత్రం చర్చలు లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అది మినహా మిగిలిన అంశాల మీద చర్చకు అభ్యంతరం లేదనే సంకేతాలను అందిస్తోంది. హుజూర్ నగర్ ఎన్నికలో అధికార పార్టీకి సీపీఐ మద్దతు ఉప సంహరించుకుంది. చర్చల బాధ్యతను రాజకీయంగా వేరే పార్టీలు..సంఘాలకు ఇచ్చి వారికి క్రెడిట్ ఇవ్వటం కంటే..పార్టీ నేతల ద్వారానే చర్చల ప్రతిపాదన తీసుకురవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ సీనియర్ కేకే జోక్యం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్టీసీ జేఏసీ సంఘాలు సైతం పట్టుదలకు పోకుండా చర్చలకు సానుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.
హైకోర్టులోనూ విచారణ నేడే..
ఇప్పటికే సమ్మె అంశం మీద హైకోర్టులో రెండు సార్లు విచారణ సాగింది. మరో దఫా విచారణ నేడు జరగనుంది. అయితే..సమ్మె అంశంలో అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాల పైన క్షేత్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. కార్మిక సంఘాల నుండి చర్చలకు సిద్దమనే ప్రతిపాదన రావటంతో..ఈ రోజు కోర్టు విచారణ..నిర్ణయం చూసిన తరువాత ప్రభుత్వం లేదా అధికార పార్టీ నుండి మధ్నాహ్నానికి సమ్మె మీద చర్చల దిశగా అడుగు పడే అవకాశం కనిపిస్తోంది. కోర్టు నుండి ఏమైనా డైరెక్షన్స్ వస్తే వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ రోజు సమ్మె విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.