ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 24వ రోజుకు చేరింది. ఇటు కార్మికులు బెట్టు చేయడం.. అటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడం.. మొత్తానికి ఆర్టీసీ సమ్మె పీక్ స్టేజీకి చేరింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన పది రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. అదలావుంటే సమ్మెలో భాగంగా హైకోర్టుకు చేరిన వివిధ పిటిషన్లకు సంబంధించి సోమవారం (28.10.2019) నాడు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపికైంది.
అదలావుంటే ఆర్టీసీ సమ్మెపై విచారణ మంగళవారం (29.10.2019) నాటికి వాయిదా వేసింది హైకోర్టు. మంగళవారం నాడు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మరోసారి వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఆలోగా ప్రభుత్వం సమ్మెకు సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వివరాలు మొత్తం ఇవ్వాలని కోరింది.
ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది. సోమవారం నాడు 24వ రోజుకు చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. ఆ క్రమంలో ఆయా జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు మిన్నంటాయి. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. మహిళా కండక్టర్ ఆత్మహత్య.. తాత్కాలిక సిబ్బందితో పరేషాన్..!
మధ్యలోనే వెళ్లిపోయారు.. 21 డిమాండ్లపై మాట్లాడదామంటే వినలేదు..!
ఆర్టీసీ సమ్మెకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం నాడు వాదనలు జరిగాయి. ఆర్టీసీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఆర్టీసీ కార్మికులు 45 డిమాండ్లపై పట్టుబడుతున్నారని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్పై తొలుత చర్చ జరగాలని మొండికేస్తున్నారని చెప్పుకొచ్చారు. న్యాయస్థానం ఇదివరకు చెప్పినట్లుగా మొదట 21 డిమాండ్లపై చర్చలు జరుపుదామంటే వినడం లేదని వివరించారు. ఇటీవల చర్చలకు పిలిచిన సమయంలో మధ్యలోనే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారనే విషయం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
రాత్రికి రాత్రి విలీనం జరుగుతుందా?
ఆర్టీసీ తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనే డిమాండ్పై కార్మికులు పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చలు జరపొచ్చు కదా అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. విలీనం అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదని.. అదెలా సాధ్యమవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన 45 డిమాండ్లలో సంస్థపై ఆర్థిక భారం పడని డిమాండ్లపై తొలుత చర్చ జరగాలని సూచించింది. ఆర్టీసీ ఇప్పటికిప్పుడు తీర్చే అవకాశమున్న 21 డిమాండ్లపై మొదట చర్చ జరిగితే కనీసం కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం వస్తుంది కదా అనే రీతిలో వ్యాఖ్యలు చేసింది.
పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!
విలీనం పక్కన పెట్టి మిగతా వాటిపై చర్చించడంటూ..!
అదలావుంటే ఆర్టీసీ కార్మికుల తరపున లాయర్ ప్రకాశ్ రెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. చర్చల విషయంలో ఇదివరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 45 డిమాండ్లపై కాకుండా కేవలం 21 డిమాండ్లనే పరిగణనలోకి తీసుకుంటామని.. వాటిపైనే చర్చిస్తామనే తీరుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే విలీనం డిమాండ్ పక్కనబెట్టి మిగతా వాటిపై చర్చ జరిపితే బాగుంటుందని.. లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్ఠంభన నెలకొనే ప్రమాదం ఉందని హైకోర్టు సూచించింది. అదే జరిగితే ఇటు కార్మికులతో పాటు అటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారనే విషయం కూడా గుర్తు చేసింది.