ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
వరంగల్ : ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారింది. కార్మికుల ఆందోళనలు, నిరసనలకు ప్రజా సంఘాల నేతలు, పొలిటికల్ లీడర్లు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె వెనుక మా పార్టీ వాళ్లే ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. సమ్మె ఉధృతంగా మారడానికి మా వాళ్లే ఆజ్యం పోస్తున్నారంటూ ఆయన మాట్లాడిన తీరు గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. వాళ్లెవరో సీఎం కేసీఆర్కు చెబుతానంటూ స్పష్టం చేయడంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది.
ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం.. ఈ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అలా..!
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో కార్మికులు చేపట్టిన ఆందోళన పర్వం ఉద్రిక్తంగా మారుతోంది. వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ సమ్మెకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి.
సొంత గూటి నేతలపై ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు హాట్ టాపికైంది. ఓ టీవీ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు గులాబీ నేతలు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో ఆర్టీసీ సమ్మె వెనుక కూడా టీఆర్ఎస్ నేతలు ఉన్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని.. ఆ వివరాలు అన్నీ కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు.
ఆనాడు ఆర్టీసీకి జై.. ఈనాడు కేసీఆర్కు సై.. మంత్రి ఎర్రబెల్లి తీరు ఇలా..!
వివాదస్పద ఎమ్మెల్యేగా ముద్ర.. సొంత గూటి నేతలపై ఈసారి..!
వివాదస్పద ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఇదివరకు చాలా సందర్భాల్లో ఆయన దూకుడుగా వ్యవహరించారనేది అందరికీ తెలిసిందే. అయితే ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆయన పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడటం చర్చానీయాంశమైంది. ఆర్టీసీ సమ్మె వెనుక మా పార్టీ నేతలే ఉన్నారని.. వారే ఆజ్యం పోస్తున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇదంతా కూడా తనకు ఎప్పటికప్పుడు కొందరు చెబుతున్నారని.. అయితే ఆ నేతలు ఎవరనేది మాత్రం సీఎం కేసీఆర్ దగ్గర వెల్లడిస్తానని బాంబ్ పేల్చారు. ముత్తిరెడ్డి తాజా వ్యాఖ్యలతో గులాబీ నేతల్లో కలవరం మొదలైనట్లుగా సమాచారం. ఆయన ఎవరి పేర్లు బయటపెడతారో అనేది ఉత్కంఠగా మారింది.
2017లో అప్పటి కలెక్టర్తో విభేదాలు.. ఆ భూముల్లో అక్రమాలు చేశారంటూ..!
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం.. దూకుడుగా వ్యవహరించడం ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే ఆయనపై చాలా ఆరోపణలున్నాయి.
2017లో జనగామ కలెక్టర్గా పనిచేసిన దేవసేనతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి జరిగిన వివాదం రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమే. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటకు సంబంధించిన భూమిని కొంతమేర ముత్తిరెడ్డి ఆక్రమించారని.. దానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయనేది కలెక్టర్ వెర్షన్. అయితే కలెక్టర్ ఆరోపణల్లో నిజం లేదంటారు ముత్తిరెడ్డి. ఆ క్రమంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది.
రిజర్వేషన్లపై వివాదస్పద వ్యాఖ్యలు.. రెడ్డిలకు న్యాయం చేయాలంటూ..!
అదలావుంటే 2017, డిసెంబర్ నెలలో రిజర్వేషన్లపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడిన తీరు మరో వివాదానికి కారణమైంది. వివిధ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే రెడ్డి వర్గానికి న్యాయం జరుగుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలుత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదేళ్ల పాటు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని, ప్రభుత్వాలు మాత్రం రిజర్వేషన్లను పొడిగించుకుంటూ పోతున్నాయని ధ్వజమెత్తారు. ఆ కారణంగా రెడ్డి లాంటి అగ్రకులాల్లోని విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
ఆర్టీసీ సమ్మె చట్టబద్ధం కాదా.. ఉద్యమంలో మీ జాడేది.. ఆ ముగ్గురు మంత్రులపై రేవంత్ చిందులు..!
2018లో మహిళా వీఆర్వో పట్ల అనుచితంగా మాట్లాడి..!
ఇక 2018, ఆగస్టులో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని మరో వివాదం చుట్టుముట్టింది. జనగామ మండలం పెంబర్తి ఏరియాలోని ఓ వెంచర్ విషయంలో మహిళా వీఆర్వోను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లి హల్చల్ చేశారనే కథనాలు వెలువడ్డాయి. సదరు వీఆర్వో పట్ల అనుచితంగా మాట్లాడారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేసే క్రమంలో కొందరు టీఆర్ఎస్ నేతలు ఆమెను శాంత పరిచి ముత్తిరెడ్డికి సహకరించే విధంగా చక్రం తిప్పారనే టాక్ నడిచింది. అయితే ఇలాంటి వివాదాలు కామన్గా చూసే ముత్తిరెడ్డి.. ఇప్పుడు సొంత గూటి నేతలపై పేల్చిన బాంబ్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.