చలో ట్యాంక్బండ్లో కార్మికులు, ప్రజాసంఘాలే పాల్గొన్నారు,పోలీసుల ఆరోపణలపై అశ్వత్ధామరెడ్డి
చలో ట్యాంక్బండ్ కార్యక్రమం విజయవంతమైతే ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కార్యక్రమంలో కార్మికులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొనడంతో ప్రభుత్వ వెన్నులో వణుకు మొదలైందని ఆరోపించారు. అందుకే పసలేని ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. నిన్నటి కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం పోలీసుల చేత ఆరోపణలు చేయిస్తుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి మండిపడ్డారు.
ఓర్వలేకే..
శనివారం నిర్వహించిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి కార్మికులు, ప్రజాసంఘాల నుంచి విశేష స్పందన వచ్చిందని అశ్వత్ధామరెడ్డి తెలిపారు. కానీ దానిని చూసి ప్రభుత్వం ఓర్వలేదని విమర్శించారు. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో కార్మికులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారని స్పష్టంచేశారు. కానీ పోలీసులు మావోయిస్టులు కూడా పాల్గొన్నారని ఆపాదిస్తున్నారని గుర్తుచేశారు. ఇది సరికాదని పాల్గొనని వారిని పాల్గొన్నట్టు చూపించడం మంచి పద్ధతి కాదన్నారు.
వాస్తవాలను వక్రీకరించండి..
తమ డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం పోలీసుల చేత తప్పుడు మాటలు చెప్పిస్తోందని అశ్వత్ధామ విమర్శించారు. పోలీసులు కూడా న్యాయంగా వ్యవహరించాల్సింది పోయి.. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసుల వ్యాఖ్యలతో జనానికి చెడు సంకేతాలు వెళతాయని చెప్తున్నారు.
సమ్మె@37
ఆర్టీసీ సమ్మె 37వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మెబాట పట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భీష్మించుకొని కూర్చొన్నారు. పీఆర్, ఐఆర్ సహా 26 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్నవి తప్ప మిగతా 21 డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఆర్టీసీ విలీనం డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పకపోవడంతో కార్మికులు పట్టువీడటం లేదు. ఇటు ప్రభుత్వం కూడా మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. దీంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది.
విచారణ పర్వం..
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రభుత్వం, కార్మికులు పట్టువీడాలని హైకోర్టు సూచించింది. అయినా ఇరు వర్గాలు బెట్టుచేయడంతో ప్రగతిరథ చక్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల ఇబ్బంది దృష్ట్యా సమస్య పరిష్కారం కోసం ఇరువర్గాలు పాటుపడాలని హైకోర్టు సూచించింది. సమ్మెపై సోమవారం మరోసారి హైకోర్టులో విచారణకు రానుంది.
కండక్టర్ల చేతివాటం..?
మరోవైపు కొందరు కాంట్రాక్ట్ కండక్టర్లు రెచ్చిపోతున్నారు. ఇదే అదనుగా భావించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఖమ్మం మధిర డిపోలో తాత్కాలిక కండక్టర్ చేతివాటం ప్రదర్శించారు. డిపో ఇచ్చిన టికెట్లు కాకుండా నకిలీ టికెట్లతో రూ.17 వేలు తీసుకున్నాడు. దీనిని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. నగదు గురించి ఆరాతీస్తే నిజమేనని తేలింది. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు.