తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్!!! అక్టోబర్ 5 నుంచి స్ట్రైక్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కార్మిక సంఘాలను వచ్చేనెల 4వ తేదీని ఆహ్వానించింది. కానీ ఈ లోపే కార్మికులు సమ్మెబాట పట్టారు.
ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారు. దీంతోపాటు 11 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మెబాట పట్టారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులను విద్యాసంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు సమ్మెబాట పట్టడం ఉత్కంఠ రేపుతోంది.
తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఎంయూ నేతలు డిమాండ్ చేశారు. విలీనం చేస్తామని హామీనిచ్చి సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఐఆర్, డీఆర్ వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని వివరించారు.
రూ.5 వేల కోట్ల పైచిలుకు నష్టాలతో ఉందని తెలిపారు. నష్టాలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్టీసీలో 7 వేల మంది కార్మికులు పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. కొత్తగా ఉద్యోగాలను నియమించడం లేదని .. దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుందన్నారు. కానీ కార్మికుల సమస్యలను కార్పొరేషన్ పట్టించుకోవడం లేదన్నారు.