బస్సు కింద పడబోయి.. ఆర్టీసీ కార్మికుడు సూసైడ్ అటెంప్ట్..!
వికారాబాద్ : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఉధృతంగా మారుతోంది. సోమవారం నాడు 24వ రోజుకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదలావుంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డ తీరు చర్చానీయాంశమైంది. తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసీ బస్సు కింద పడి బలవన్మరణానికి పాల్పడే క్రమంలో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే మరో కార్మికుడు బలయ్యేవాడు.
పరిగి డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుడు వెంకటయ్య బలవన్మరణానికి పాల్పడబోయాడు. తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసీ బస్సు కింద పడి ప్రాణాలు తీసుకోబోయాడు. అయితే సదరు బస్సు డ్రైవర్ వెంకయ్య ప్రయత్నం గమనించి అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సుకు బ్రేకులు వేయడంతో వెంకటయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే బస్సు టైర్ల కింద పడి ప్రమాదం జరిగి ఉండేది.
ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ఆర్టీసీ సమ్మెతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గత నెల జీతాలు రాక నానా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇటీవల హోమ్ లోన్ కట్టలేక ఓ కండక్టర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో చాలామంది కార్మికులు జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. పరిగిలో బస్సు కింద పడబోయిన వెంకటయ్య పరిస్థితి కూడా అదే. కాలేజీలో ఫీజు చెల్లించలేదని తమ పిల్లలను ఇంటికి పంపించారనే మనస్థాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.