ఆర్టీసీ కార్మికులకు ఏబీవీపీ మద్దతు.. ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మిక సంఘాల ఆందోళనలకు వివిధ ప్రజా సంఘాల నేతలు, పొలిటికల్ లీడర్లు తోడవుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాల్సిందే అంటూ అండగా నిలబడుతున్నారు. కొందరు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె మరింత ఎరుపెక్కుతోంది. ఆ క్రమంలో విద్యార్థి సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ కార్యకర్తలు కదం తొక్కారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఆర్ట్స్ కళాశాల దగ్గర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలన మంచిది కాదంటూ హితవు పలికారు.
నాడు - నేడు : కార్మికులకు సపోర్ట్.. ప్రభుత్వానికి వత్తాసు.. ఇదేందీ మంత్రి గారు..!
ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇదంతా కూడా కేసీఆర్ అహంకార ధోరణి వల్లే జరుగుతోందని ధ్వజమెత్తారు ఏబీవీపీ నాయకులు. ఇప్పటికైనా భేషజాలు వీడి ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించి సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన సురేందర్ గౌడ్ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నినదించారు. వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. వెంటనే విద్యా సంస్థలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.