టీఎస్ఆర్టీసీ సమ్మె : ప్రగతి భవన్ ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం
19న రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈనేపథ్యంలోనే కార్మికులకు సంఘీభావంగా ఓయూ విద్యార్ధులు ర్యాలీని నిర్వహించారు. ప్రగతిభవన్ ముట్టడించేందుకు బయలు దేరారు. ఈ ర్యాలీలో పలు విద్యార్ధి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, టీఎస్యూ,ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు ఉన్నారు.
అయితే ఓయూలోనే విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఓయూలో ఉద్రిక్త వాతవరణం నెలకోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు విద్యార్ధుల మధ్య వాగ్వావాదం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు.మరోవైపు ఓయూ విద్యార్థులు ప్రగతి భవన్ ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘాలు చేపడుతున్న నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నినాదాలతో ఆర్టిసి డిపోల వద్ద చేపడుతున్న నిరసన కార్యక్రమాలతో డిపోలు దద్దరిల్లిపోతున్నాయి. అఖిలపక్ష నాయకులు, జేఎసి నాయకులు, విద్యార్థి సంఘాలతో కలిసి వందలాది మంది ఆర్టిసి కార్మికులు పాదయాత్రల్లో పాల్గొని ఆర్టిసిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక నగరంలోని ప్రధాన డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు రోజూవారిగా కొనసాగుతున్నాయి.