టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీకి మరో తలనొప్పి...రూ. 760 కోట్లు పీఎఫ్ డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు
ఆర్టీసీ యాజమాన్యానికి మరొ తలనొప్పి వచ్చిపడింది. సందట్లో సడేమియా వలే... పీఎఫ్ అధికారులు ఆర్టీసీకి నోటీసులు జారీ చేశారు. కార్మికుల పీఎఫ్ డబ్బులను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ములిగేనక్కపై తాటిపండు పడ్డట్టుగా ఆర్టీసీ పరిస్థితి తాయరైంది. ఇక మోటారు వాహన చట్టం క్రింద సుమారు 500 కోట్ల రుపాయాల పన్నులను సంస్థ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ రవాణ సంస్థ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే...
టీఎస్ఆర్టీసీ సమ్మె, అనుమతి లేని చలో ట్యాంక్బండ్... రేపు ఏం జరగనుంది..?
అంతర్యుద్దంలో అప్పులపాలు
అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి... సమ్మె రూపంలో మరిన్ని కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇన్నాళ్లు ప్రభుత్వ సంస్థల అంతర్గత లావాదేవీలతో సంస్థను నెట్టుకువస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు చేతులెత్తెశాయి.. దీంతో ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతుంది. ఇప్పటికే కార్మికులకు జీతాలు లేని పరిస్తితుల్లో సంస్థ ఆర్ధిక వ్యవస్థ కూరుకుపోయింది. ఇక ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్దంలో సంస్థపై మరింత భారం పెరుగుతోంది. దీంతో ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం... మోటారు వాహనాల చట్టం ప్రకారం సుమారు 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని రావాణాశాఖ అధికారులు నోటీసులు పంపారు.
పీఎఫ్ అధికారుల నోటీసులు
ఇక తాజాగా కేంద్రకార్మిక శాఖ అధికారులు... కార్మికుల ఫీఎఫ్ డబ్బులు జమ కాలేదని, వాటికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు అధికారులు పీఎఫ్ కార్యాలయంలో హజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కార్మికులకు సంబంధించి 760 కోట్ల రూపాయలు పీఎఫ్ ఖాతకు జమ కాలేదని తమ దృష్టికి వచ్చినట్టు అధికారులు నోటీసులో పేర్కోన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 15లోగా పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ పీఎఫ్ డబ్బులను చెల్లించకపోతే సంస్థపై భారీ జరిమానాలు కూడ విధిస్తామని నోటిసులో పేర్కోన్నారు.
పీఎఫ్ డబ్బులను జీతాలుగా వాడుకున్న ఆర్టీసీ
అయితే లోటుబడ్జెట్లో ఉన్న ఆర్టీసీ, కార్మికుల పీఎఫ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపణలు వచ్చాయి.. దీంతో అందుకు సంబంధించిన వివరణను రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇచ్చింది. అయితే పీఎఫ్ డబ్బులను జమ చేయకుండా తిరిగి కార్మీకుల జీతాలకే చెల్లించినట్టు సమాచారం. దీంతో కనీసం రిటైర్ అయిన కార్మికులకు కూడ పూర్తిస్థాయి ప్రయోజనాలు ఇవ్వలేని పరిస్థితి తయారైంది. అయితే ఈ మొత్తం వ్వవహరంపై పీఎఫ్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్పోరేషన్పై ఎప్పుటికప్పుడు ఒత్తిడి తేవాల్సిన పీఎఫ్ అధికారులు... సమ్మె నేపథ్యంలోనే బయటకు వచ్చారు. సమస్య తమకు పీకకు చుట్టుకోకుండా చర్యలు చేపట్టారు. దీంతో 760 కోట్ల రుపాయాలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. అయితే జీతాలకే సరిగా లేని ఆర్టీసీ యాజమాన్యం పీఎఫ్ డబ్బులను ఎలా చెల్లిస్తుందో వేచి చూడాలి.