TSRTC STRIKE : సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే ప్రశ్నలు సంధించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ బంద్ జరగడానికి గల కారణాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొన్ని ప్రశ్నలను కేసీఆర్ కి సంధించారు .
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపద్యంలో సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. కేసీఆర్ రెండో దఫా పాలన పడకేసిందని,ఆర్టీసీ సమ్మె జరగడానికి గల కారణం కేసీఆర్ అని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇక అంతే కాదు సీఎం కేసీఆర్ కు పలు ప్రశ్నలు సంధించిన రేవంత్ రెడ్డి ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో లేదు కరెక్టే, కానీ ఆర్టీసీని సగం వరకు ప్రైవేట్ పరం చేస్తామని కూడా మ్యానిఫెస్టో లో లేదు కదా,మంత్రులు దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఇంధన టాక్స్ గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 27 శాతం ఆర్టీసీకి ఇంధన టాక్స్ వేస్తున్నారని, కానీ ఎయిర్ బస్సు కి మాత్రం ఒక్క శాతమే ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ సొమ్ముని ప్రైవేట్ పరం చేయడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన ఇందులో వాస్తవం లేదా అని ప్రశ్నించారు. ఇక సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.అసలు ఆ మాటే అనే అధికారం కేసీఆర్ కి లేదని రేవంత్ చెప్పారు.
సీఎం కేసీఆర్ తీరు, మంత్రుల బాధ్యతరహిత మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాకుండా హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న కేసీఆర్ తీరుపట్ల ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.హైకోర్టు మాటలు పట్టించుకోకపోతే మొట్టికాయలు తప్పవని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఉద్యమం లో పాల్గొన్న నాయకులెవరు ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడకపోవడం దారుణమని ఆయన పరోక్షంగా హరీష్ రావ్, ఈటల రాజేందర్ గురించి ప్రస్తావించారు.