tsrtc strike: ఆగిన మరో ఆర్టీసీ డ్రైవర్ గుండె.. కలతచెంది మృత్యువాత..
మరో ఆర్టీసీ డ్రైవర్ గుండె ఆగింది. తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో డ్రైవర్, కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జగ్గయ్యపేటలో టీఎస్ఆర్టీసీ డ్రైవర్ మృతి కలచివేసింది. ఆర్టీసీ సమ్మెలో పాల్గొని.. తీవ్రంగా కలతచెంది చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. డ్రైవర్ మృతికి తెలంగాణ, ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన షేక్ ఖాజామియా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాష్ట్ర విభజనకు పూర్వం నుంచి ఆర్టీసీ డ్రైవర్గా ఖాజా పనిచేస్తున్నారు. తర్వాత టీఎస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే గత 15 రోజుల నుంచి ఆయన ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడని అతని కుటుంబసభ్యులు చెప్తున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఐఆర్, పీఆర్సీ సహా డిమాండ్లపై ప్రభుత్వం హామీనివ్వకపోవడంతో కార్మికుల సమ్మెబాటపట్టారు. గత 15 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ ఉద్రిక్తంగా కొనసాగింది. ఈ క్రమంలోనే ఖాజామియా కలత చెందారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా లేదని ఆవేదన చెందారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు ఖాజామియా మృతి పట్ల తెలంగాణ, ఏపీ ఆర్టీసీ జేఏసీ సంతాపం వ్యక్తం చేసింది.