TSRTC STRIKE:ఆర్టీసీ దీక్షకు బ్రేక్.. ఛలో కరీంనగర్ పిలుపు, డ్రైవర్ బాబు మృతికి నిరసనగా బంద్
ఆర్టీసీ సమ్మెను కార్మిక సంఘాలు మరింత ఉధృతం చేశాయి. తమ వాణిని వినిపించేందుకు పోరుబాట పట్టాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం దీక్ష చేపట్టాయి. కరీంనగర్లో డ్రైవర్ బాబు మృతితో శుక్రవారం బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ బంద్కు మద్దతు తెలిపి.. దీక్షను అర్ధాంతరంగా విరమించారు. ఛలో కరీంనగర్కు పిలుపునిచ్చారు.
కరీంనగర్ బంద్
డ్రైవర్ బాబు మృతిని నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్ణయం తీసుకుంది. బంద్కు ప్రజలు సహకరించాలని ఎంపీ సంజయ్ కోరారు. బీజేపీ ఇచ్చిన బంద్కు ఇతర పక్షాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు బంద్కు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. బీజేపీ బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బలగాలను మొహరించారు.
దీక్షకు బ్రేక్
మరోవైపు గురువారం ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం వరకు దీక్ష చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ బంద్కు బీజేపీ పిలుపునివ్వడంతో... దీక్షను విరమించింది. శుక్రవారం ఛలో కరీంనగర్కు పిలుపునిచ్చింది. నంగునూరి బాబు మృతి పట్ల జేఏసీ సంతాపం ప్రకటించింది. కరీంనగర్ బంద్కు కార్మికులంతా తరలిరావాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.
గవర్నర్కు వినతి
మరోవైపు ఆర్టీసీ సమ్మెపై కలుగజేసుకోవాలని విపక్ష నేతలు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ను కోరారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వంలో ఉలుకు, పలుకు లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సూచించాలని విన్నవించారు. తమ సూచనలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వారు మీడియాకు తెలిపారు.
ఆగిన మరో గుండె
మహబూబ్నగర్ డిపోకి చెందిన కృష్ణయ్య గౌడ్ గురువారం గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. వేతనం లేక అతని కుటుంబం ఇబ్బంది పడిందని ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. కృష్ణయ్యది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్తున్నారు. కృష్ణయ్య 20 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి అని కార్మిక నేతలు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణయ్య మృతితో ఆర్టీసీ కార్మికుల మృతుల సంఖ్య 17కు చేరింది.