TSRTC STRIKE:9న ఛలో ట్యాంక్బండ్, డిపోల వద్ద దీక్షలు, నిరసనలు, ఇదీ ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ..
ఆర్టీసీ జేఏసీ తన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి వారం రోజులపాటు తన కార్యాచరణను ప్రకటించింది. ఈయూ భవన్లో అఖిలపక్ష నేతలు ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ప్రకటించారు. దాదాపు 3 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించి తమ తదుపరి ఉద్యమ క్రమాన్ని తెలియజేశారు.
అటు ప్రభుత్వం.. ఇటు టీఎస్ఆర్టీసి..!మద్యలో జీహెచ్ఎంసీ..! ఆర్టీసీ సమ్మెలో ఎన్ని మలుపులో..!!
ఇదీ కార్యాచరణ
ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. సమ్మె 29వ రోజుకు చేరిన నేపథ్యంలో తమ వాణిని మరింత బలంగా వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రాజకీయ నేతలు కూడా మద్దతు తెలిపారు. కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతామని భరోసానిచ్చారు.
అదరం.. బెదరం..
తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్న.. భయపడి, బెదరొద్దని అందుకోసం తమ కార్యాచరణను ప్రకటించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన వీ హనుమంతరావు, తమ్మినేని వీరభద్రం, కోదండరాం, రంగారావు తదితర నేతలు పాల్గొన్నారు.
వారం రోజుల కార్యాచరణ..
3వ తేదీన అమరుల కోసం పల్లెబాట చేపడుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. పల్లెబాటతోపాటు సమావేశాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. 4వ తేదీన డిపోల వద్ద దీక్షలు చేపడుతామన్నారు. ఆర్టీసీ కార్మికులు, నేతలతోపాటు రాజకీయ నేతలు కూడా దీక్షలో పాల్గొంటారని చెప్పారు. 5వ తేదీన డిపోల వద్ద రహదారుల దిగ్బంధనం చేస్తామని వెల్లడించారు. 6వ తేదీన డిపోల ఎదుట నిరహార దీక్షలు చేపడుతామని ప్రకటించారు.
ఛలో ట్యాంక్బండ్
7వ తేదీన తమ కుటుంబసభ్యులతో కలిసి నిరసన చేపడుతామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. 9వ తేదీన ఛలో ట్యాంక్బండ్ కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు. మిలియన్ మార్క్ చేపడుతామని ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ తెలిపింది. అయితే అందుకు అనుమతి ఇస్తారో లేదోనన్న అనుమానంతో.. ఛలో ట్యాంక్బండ్ కార్యక్రమం చేపడుతామని తెలిపారు.
హస్తినబాట.
4, 5వ తేదీల్లో ఢిల్లీకి వెళతామని వివరించారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతారు. వారి మద్దతును కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ట్రేడ్ యూనియన్ నేతల దృష్టికి తమ సమస్యను తీసుకొస్తారు. వారి ద్వారా కూడా సర్కార్పై ప్రెషర్ పెడతామని.. అన్నివైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యకు పరిస్కారం కనుకొంటామని ఆర్టీసీ జేఏసీ నేతలు ధీమాతో ఉన్నారు.