TSRTC STRIKE:డ్యూటీలోకి తీసుకోవడం లేదు, లేబర్ ఆఫీసు ముందు కార్మికుల ఆందోళన
విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. యాజమాన్యం నుంచి ఆదేశాలు రానందున డ్యూటీలోకి తీసుకోబోమని తేల్చిచెప్తున్నారు. దీంతో కార్మికులు లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకొచ్చారు. తమ గోడు ఆలకించాలని.. డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ముందుకొచ్చినా..
ఆర్టీసీ డిమాండ్లపై ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ దిగొచ్చింది. సమ్మె చేపట్టి 52 రోజులవుతున్నా నేపథ్యంలో విరమిస్తున్నట్టు ప్రకటించింది. విధుల్లో చేరతామని చెబుతుంటే ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. సమస్య లేబర్ కోర్టుకు చేరినందున కోర్టు ఏం చెబితే అదే చేస్తామని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అయితే కార్మికులు మాత్రం తమను విధుల్లోకి తీసుకోవాలని డిపోల ముందు వేచిచూస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఆందోళన పర్వం
ఆర్టీసీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కార్మికులు గురువారం లేబర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమను డిపో మేనేజర్లు విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుంచి జీతం లేక అల్లాడిపోతున్నామని చెప్తున్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. తమపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ఏం చర్చిస్తారో..
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన తర్వాత తెలంగాణ క్యాబినెట్ ఇవాళ జరుగుతోంది. ఆర్టీసీ సహా ఇతర అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఇవాళ్టి సమావేశంలో ఏకాభిప్రాయం రాకపోతే శుక్రవారం కూడా సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మిగిలిన వారి సంగతేంటీ
ఆర్టీసీలో మొత్తం 49 వేల మంది కార్మికులు ఉన్నారు. ఇప్పటికే 5100 బస్సులు ప్రైవేట్ వాళ్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా 5100 బస్సులకు 49 వేల మందిలో సగం సిబ్బంది సేవలు అవసరమవుతాయి. మిగిలిన వారిని ఏం చేస్తారన్న అంశంపైనే చర్చ జరుగుతుంది. కొందరినీ వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.