TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన అశ్వత్థామ దీక్ష, కోదండరాం, కోమటిరెడ్డి సంఘీభావం, మందకృష్ణ అరెస్ట్
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి హస్తినపురంలోని తన ఇంట్లో, రాజిరెడ్డి కూడా తన స్వగృహంలో దీక్ష చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు.
వెనక్కితగ్గం..
అశ్వత్థామరెడ్డిని ఉదయం వైద్యులు పరీక్షించారు. బీపీ, షుగర్ లెవల్స్ పెరిగినట్టు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు. కానీ ఆయన డిమాండ్ల సాధన కోసం వెనక్కి తగ్గనని స్పష్టంచేశారు. మరోవైపు తన ఇంట్లో కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్ష రెండోరోజుకు చేరుకుంది. దీక్షపై కూడా ప్రభుత్వం తప్పుడు మాటలు మాట్లాడిందని పేర్కొన్నారు. శనివారం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పచ్చి అబద్ధమని దుయ్యబట్టారు.
మూడంచెల భద్రత
తమకు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపితే తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదన్నారు. రోడ్డుమీదికొచ్చిన కార్మికులకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. గత 44 రోజులుగా నుంచి రాజకీయ నేతలు చెబితే కార్మికులు సమ్మె చేయరని స్పష్టంచేశారు. వారి మనోవేదనతోనే సమ్మె కొనసగుతుందని చెప్పారు. మరోవైపు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇళ్ల మధ్య మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. కార్మికులు చొచ్చుకొని వస్తే ఉద్రిక్త నెలకొనుండటంతో.. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
సంఘీభావం
నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి ఇంటి వద్దకు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం వచ్చారు. దీక్షకు మద్దతు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా సంఘీభావం తెలిపారు. డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. ఈ నెల 19వ తేదీన హయత్ నగర్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్ కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
సబ్బండ కులాల దీక్షకు..
ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సబ్బండ కులాల దీక్షకు పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద చేపట్టే దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్క్ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. మరోవైపు మందకృష్ణను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హబ్సిగూడలోని నివాసంలో అదుపులోకి తీసుకుని మేడపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
పెట్రోలింగ్ వాహనంలో..
కానీ మందకృష్ణను ఎక్కడికి తరలించామనే అంశంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదని అనుచరులు చెప్తున్నారు. మేడిపల్లి నుంచి కూడా తీసుకెళ్లారని తెలిపారు. పెట్రోలింగ్ వాహనంలో ఆయా స్టేషన్లలో తిప్పుతున్నారని వెల్లడించారు. ఇటు ఇందిరాపార్క్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటుచేసి.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారని ఎక్కడికక్కడే నియంత్రిస్తున్నారు. పార్క్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. అక్కడ పరిస్థితిని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా సమీక్షించనున్నారు.