TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన కూనమనేని దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, వీహెచ్..
ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనమనేని సాంబశివరావు చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. దీక్షకు టీడీపీ, కాంగ్రెస్ నేత వీహెచ్ మద్దతు ప్రకటించారు. సమ్మె విషయంలో ప్రభుత్వం పట్టు, విడుపుగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సూచించారు.
చర్చలు ఆపేయడం ఏంటీ ?
శనివారం చర్చలను అర్ధాంతరంగా ఆపివేయడం సరికాదని చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారం కృషిచేయాలే తప్ప మొండిగా వ్యవహరించొద్దని సూచించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు 26 సమస్యలు పరిష్కరించాలని కోరితే.. 21 డిమాండ్లకు ఓకే అని ఆర్టీసీ యాజమాన్యం తెలుపడం సరికాదన్నారు. మిగతా ఐదు డిమాండ్లు ఎందుకు నెరవేర్చారని ఆయన ప్రశ్నించారు. అందులో ఆర్టీసీ విలీనం సహా పీఆర్, ఐఆర్ తదితర డిమాండ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ కూడా..
మరోవైపు టీఎస్ యూటీఎఫ్ కూడా కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపింది. సమ్మెకు మద్దతుగా దీక్ష చేపట్టింది. మరోవైపు సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు దీక్షకు టీడీపీ మద్దతు ప్రకటించింది. సీపీఐ కార్యాలయంలో దీక్ష చేస్తున్న కూనమనేనికి టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. టీడీపీ కమిటీ అధ్యక్షుడు రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూనమనేన దీక్షకు మద్దతు తెలిపారు.
నారాయణ కూడా
పార్టీ కార్యాలయంలో కూనమనేని దీక్ష చేపట్టగా ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ కూడా మద్దతు తెలిపారు. దీక్షకు మద్దతు ఆశీనులయ్యారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటు కూనమనేని దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరుబాట సహజమేనని.. కానీ కార్మికులపై అణగదొక్కే వైఖరి సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
చర్చలు విఫలం
ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో యాజమాన్యం శనివారం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కార్మికులు 26 డిమాండ్లు ముందు ఉంచగా,. 21 డిమాండ్లు ఓకే అని చెప్పడంతో కార్మికనేతలు అర్థాంతరంగా చర్చల నుంచి వచ్చారు. అంతేకాదు చర్చల సందర్భంగా తమ ఫోన్లను కూడా స్విచాఫ్ చేశారని గుర్తుచేశారు. నిర్బంధించి చర్చలు జరపడం ఏంటి అని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.