ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. బస్ భవన్ దగ్గర లాయర్లు అరెస్ట్.. నాంపల్లి కోర్టు దగ్గర టెన్షన్
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేసింది హైకోర్టు. శుక్రవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్కు పలు ప్రశ్నలు సంధించింది న్యాయస్థానం. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం ఎందుకు నిలువరించ లేకపోతోందని నిలదీసింది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదలావుంటే నాంపల్లి కోర్టు దగ్గర సమ్మెకు సంఘీభావం ప్రకటించి లాయర్లు నిరసన తెలపడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో టెన్షన్ సిట్యువేషన్ కనిపించింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మంగళవారం (15.10.2019) నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా అటు కార్మికులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. అయితే రెండు రోజుల్లో సమస్య పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆదేశించింది. ఆ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం నాడు మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
ఉద్యమంతో గెలిచి, పోరాటాలను అణిచి.. విద్యాసంస్థల సెలవుల పొడిగింపు అందుకేనా..!
సమ్మెను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయిందంటూ..!
రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది న్యాయస్థానం. అసలు సమ్మెను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని నిలదీసింది. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న న్యాయస్థానం ఆ మేరకు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీకి కొత్త ఎండీ నియామకంపై అడిగిన ప్రశ్నకు.. కొత్త ఎండీని నియమించడం వల్ల సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదని.. ఇప్పటికే అక్కడ సమర్థవంతమైన అధికారి ఇన్ఛార్జ్గా ఉన్నారనే విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అడ్వకేట్ జనరల్. దాంతో హైకోర్టు మరో ప్రశ్న సంధించింది. ఇప్పుడున్న అధికారి సమర్థుడైతే ఆయన్ని ఎండీగా ఎందుకు నియమించలేదని అడిగింది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించింది న్యాయస్థానం. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని అర్థం వచ్చేలా ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మెకు మరికొంత మంది తోడై మద్దతు తెలిపితే సమ్మెను ఎవరూ ఆపలేరంటూ చురకలు అంటించింది.
ఆర్టీసీ సమ్మెకు లాయర్ల మద్దతు.. బైక్ ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నారు న్యాయవాదులు. ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆ క్రమంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. 19వ తేదీ శనివారం నాడు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు తలపెట్టిన తెలంగాణ బంద్కు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో లాయర్లు పోగై బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. నాంపల్లి కోర్టు నుంచి బస్ భవన్ దగ్గరకు ర్యాలీ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది.
కేసీఆర్ సభకు కాంగ్రెస్ విన్నింగ్కు లింక్ ఉందా.. గెలుపుపై ధీమా మరింత పెరిగిందా..?
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
బైక్ ర్యాలీకి ముందు నాంపల్లి కోర్టు దగ్గర కూడా టెన్షన్ వాతావరణం కనిపించింది. బైక్ ర్యాలీ తలపెట్టిన న్యాయవాదులు కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. అయితే నాంపల్లి కోర్టు నుంచి బస్ భవన్కు ర్యాలీగా బయలుదేరే సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినట్లైంది. పోలీసులను ఎదురించి బైక్ ర్యాలీ కంటిన్యూ చేశారు న్యాయవాదులు.