tsrtc strike: టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ -నేటితో డెడ్ లైన్ పూర్తి -జీతాలియ్యకుంటే రేపట్నుంచే..
కరోనా విలయం దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(టీఎస్ఆర్టీసీ)లో మరో ప్రతిష్ట్రంభన నెలకొంది. టీఎస్ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్ మోగనుంది. నేటి వరకూ జీతాలు చెల్లించకపోవడంతో బస్సులు బంద్ చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సిద్ధమయ్యారు.
రవాణా సంస్థలో సమ్మెకి సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చింది. ఆగస్టు 6 తేదీ లోపు ఈ నెల జీతాలు చెల్లించకుంటే సమ్మె బాట పడతామని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తేల్చి చెప్పేశారు. గతంలోనే పలు డిమాండ్లకు సంబంధించి మెమోరాండం సమర్పించి నెల రోజులు కావొస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు జేఏసీ లేఖ రాసింది.
శుక్రవారంలోగా జీతాలు చెల్లించకుంటే 7 వ తేదీ నుంచి, అంటే శనివారం నుంచే సమ్మె చేయనున్నట్లు లేఖలో జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారంపై కూడా యాజమాన్యం ఇంతవరకూ స్పందించపోవడం దారుణమని.. ఇప్పటి వరకూ కనీసం అధికారులను కూడా నియమించలేదని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది.
Recommended Video
వేతనాలు విడుదల చేయకపోతే సమ్మె చేస్తామని.. తమ కష్టాలు ఎమ్మెల్యేలందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ నిర్ణయించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.