TSRTC STRIKE : తెలంగాణా రాష్ట్ర బంద్ .. టెన్షన్లోనూ ఫంక్షన్కు సీఎం కేసీఆర్ హాజరు
తెలంగాణ సీఎం కేసీఆర్... ఏం చేసినా ఓ సంచలనమే. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనమే. హైకోర్టు చీవాట్లు పెడుతున్నా తనకేమీ పట్టనట్టు గా వ్యవహరిస్తున్న ఆయన వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశమే. ఒకప్పుడు ఉద్యమాలతో తెలంగాణా రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాలను లైట్ తీసుకుంటున్నారు. అది ఎంతలా అంటే తెల్లారితే రాష్ట్ర బంద్ జరగనుంది అని తెలిసినా, హైకోర్టు ప్రభుత్వానికి క్లాస్ పీకినా సరే ఫంక్షన్ కు వెళ్లి వచ్చేంత లైట్ గా ఆయన ఉద్యామాన్ని తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
నిన్నటి నుండే బంద్ ప్రభావం .. నిన్ననే అశ్వత్థామ రెడ్డి అరెస్ట్
అన్నిటికంటే నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఎక్కడికి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ రోజు బంద్ ప్రభావం నిన్న సాయంత్రం నుండే కనిపిస్తుంది. నిన్ననే జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ చాలా కూల్ గా ఇంత టెన్షన్ లోనూ సీఎం కేసీఆర్ నిన్న రాత్రి ఫంక్షన్ కి వెళ్లొచ్చారు అంటే ఇది అవాక్కయ్యే విషయమే . తెలంగాణా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో ఆయనకు పెట్టింది పేరు. కానీ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనను అభాసుపాలు చేస్తుంది.
ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు డెడ్ లైన్ .. ప్రగతి భవన్ కు ఉన్నతాధికారులు
ఏకంగా హై కోర్టు తెలంగాణా ప్రభుత్వానికి కార్మికులతో చర్చలు జరపాలని , సామరస్యపూర్వకంగా పరిష్కారం వెతకాలని రెండు సార్లు హెచ్చరించినా , డెడ్ లైన్లు విధించినా కూడా సీఎం కేసీఆర్ అవేవీ పట్టనట్టు చాలా తాపీగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం చర్చలు జరపకపోవటంపై హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రగతిభవన్లో సమీక్ష కోసం ఉన్నతాధికారులకు ప్రగతి భవన్ నుంచి సమాచారం అందించారు. నిన్న రాత్రి వారికి ఎడెనిమిది గంటల ప్రాంతంలో రావాలని ఆదేశించిన నేపధ్యంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా తో పాటుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్ కు వెళ్లారు.
చందన దీప్తి రిసెప్షన్ కు సీఎం ..ప్రగతి భవన్ లో అధికారుల నిరీక్షణ
అయితే సీఎం కేసీఆర్ మాత్రం తాజా రాజకీయ పరిణామాలు , పాలనా పరమైన ఇబ్బందులతో ఏ మాత్రం సంబంధం లేనట్టు మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి రిసెన్షన్ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ సీఎం కేసీఆర్ చందన దీప్తి దంపతులను ఆశీర్వదించి , అక్కడికి వచ్చిన రాజకీయ ప్రముఖులతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఏం చెయ్యాలో అని చాలా టెన్షన్తె తో ప్రగతి భవన్ కు పరుగులు పెట్టిన అధికారులు అక్కడ సీఎం కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయారు. ఇక ఫంక్షన్ నుండి వచ్చిన సీఎం కేసీఆర్ అధికారులతో ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా సేపటికి వచ్చి ముక్తసరిగా రెండు మాటలు చెప్పి వెళ్లిపోయారట .
ఇంత టెన్షన్ లో ఫంక్షన్ కు వెళ్ళివచ్చిన సీఎం తీరుపై చర్చ
ఇంత టెన్షన్ వాతావరణంలో అంత లైట్ గా తీసుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్ తీరుకు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఒకప్పుడు ఉద్యమాలతోనే తెలంగాణా రాష్ట్రం సాధించొచ్చు అనిచెప్పిన ఉద్యమకారుడు కేసీఆర్ సీఎం కేసీఆర్ గా మారగానే ఉద్యమాలను అణచి వెయ్యాలని చూడటం, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవటం, అందుకు తగినట్టుగా ఆయన ప్రవర్తన ఉండటంతో ఆర్టీసీ కార్మికులు రగిలిపోతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులతో చర్చలు జరపాల్సి ఉన్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ మదిలో ఏముందో అర్ధం కాక, అటు కోర్టుకు సమాధానం చెప్పలేక అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.