టీఎస్ఆర్టీసీ సమ్మె, సీఎంతో సమావేశమైన కేకే
సీఎం కేసీఆర్తో కేకే భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్చలకు సిద్దమంటూ కేకే బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలోనే ఇరువురి మధ్య భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కార్మికులతో ఎలాంటీ చర్చలు జరిపేది లేదని మరోసారి స్పష్టం చేశారు. కాగా కేకే మధ్యవర్తిత్వంలో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ జేఏసీ కార్మికులు అంగీకరించిన విషయం తెలిసిందే.
ఆర్టీసీ సమ్మెపై సానుకూల ప్రకటన చేసిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే. కేశవరావు సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు. సమ్మెపై కేకే మధ్యవర్తిత్వం వహిస్తానని కేకే ప్రకటించడంతో సమ్మె చేస్తున్న కార్మికులు సానుకూలంగా స్పందించారు. ఆయన సమక్షమంలో చర్చలు జరిపేందుకు తాము సిద్దమని ప్రకటించారు. అయితే సమ్మెపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని కేకే తేల్చి చెప్పారు. ఒకవేళ సీఎం కేసీఆర్ ఆదేశిస్తేనే కార్మికులతో చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సైతం కార్మికులతో చర్చలు జరిపేది లేవని స్పష్టం చేశారు. అధికారులు, మంత్రులతో సుధీర్ఘంగా చర్చించిన అనంతరం సీఎం ఈ ప్రకటన చేశారు. అయితే ఆర్టీసీ సమ్మెపై వాదనలు విన్న కోర్టు మాత్రం రెండు రోజుల్లో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈనేపథ్యంలోనే కేకే సీఎం కేసీఆర్తో పాటు, రవాణ శాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్తో భేటి అయ్యారు. దీంతో సీఎంతో ఎదైనా నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు హుజుర్నగర్ ఎన్నికల సభలో సీఎం మరికాసేపట్లో పాల్గోననున్నారు. దీంతో బహిరంగ సభలో ప్రకటించే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.