టీఎస్ఆర్టీసీ సమ్మె, అశ్వత్థామ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్దం...ఇంటివద్ద ఉద్రిక్తత
ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉదయం నుండి తన ఇంటివద్దే నిరవధిక దీక్ష చేస్తున్న జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి అరెస్ట్కు పోలీసులు రంగం సిద్దం చేశారు. ఆయన ఇంటివద్ద మద్దతుదారులను పంపించి ఇంట్లోకి ఎవరు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో అర్థరాత్రిలోగా అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మెలో భాగంగా నేడు సాముహిక దీక్షలు చేపట్టాలని జేఏసీ పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా వాటిని ప్రారంభించేందుకు ఉద్యోగులు సన్నద్దమయ్యారు. దీంతో కార్మికులు చేపట్టే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు వాటిని భగ్నం చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హైదరాబాద్ లోని తన ఇంట్లో నిరవధిక దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటివద్ద ఉద్రిక్త వాతవరణం నెలకొంది.
ఆయన దీక్షకు మద్దతు పలికేందుకు వెళ్లిన నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయం నుండి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇందుకోసం ఇంటి తలుపులను మూసిన పోలీసులు మద్దతుదారులు ఎవ్వరు రాకుండా కట్టడి చేశారు. దీంతో పది గంటలుగా ఆయన పోలీసుల నిర్భంధంలో కొనసాగుతున్నారు. అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు బలవంతంగానైనా అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.