కోర్టులంటే లెక్కలేదా..? గతంలో పదవులకు రాజీనామాలు.. కేసీఆర్పై వీహెచ్ గుస్సా
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మొండి వైఖరి సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం పట్టువిడుపు ధోరణి ప్రదర్శించాలే తప్ప తాను చెప్పిందే వినాలనే పద్ధతి మంచిది కాదన్నారు. హైకోర్టు సూచనలను కూడా కేసీఆర్ సర్కార్ బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. గతంలో పాలకులు కోర్టు సూచనలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ మాత్రం ఇసుమంత గౌరవం కూడా కోర్టులకు ఇవ్వడం లేదన్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు చెప్పినా.. కేసీఆర్ ప్రభుత్వం ఉలుకు లేదు, పలుకు లేదని విమర్శించారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కోర్టులంటే పాలకులు భయపడేవారని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ మాత్రం కోర్టులను కూడా లెక్కచేయడం లేదన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. వైఖరి మార్చుకోవాలని, లేదంటే ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.
ఇదివరకు కోర్టు వ్యాఖ్యలు చేసే నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని వీహెచ్ గుర్తుచేశారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టు పదే పదే కల్పించుకుందని చెప్పారు. కోర్టు మొట్టికాయలు వేసినా.. కేసీఆర్ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్లు అని వీహెచ్ తెలిపారు. అందుకే వారి అన్ని వర్గాలవారు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు. హుజూర్ నగర్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి జనసేన మద్దతిస్తోందని తెలిపారు.