TSRTC STRIKE:కార్మికుల డిమాండ్లు పరిష్కరించం, చర్చలు జరపం, హైకోర్టులో ఆర్టీసీ అఫిడవిట్
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో కార్మికులు సమ్మెకు దిగారని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు 11 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు కార్పొరేషన్ 44 శాతం అంటే రూ.473 కోట్ల వరకు నష్టం చవిచూసిందని పేర్కొన్నారు. విలీనమనే అసహేతుక డిమాండ్ను కార్మికులు తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో కార్పొరేషన్ తరఫున తుది అఫిడవిట్ దాఖలు చేశారు.
డిమాండ్లు పరిష్కరించలేం..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్లో పేర్కొన్నారు. విలీనం పేరుతో సంస్థ, ప్రభుత్వాన్ని కార్మికులు ఇబ్బందికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించలేమని స్పష్టంచేశారు. అంతేకాదు కార్మికులతో ఇక చర్చలు కూడా జరపలేమని అఫిడవిట్లో తేల్చిచెప్పారు.
తాత్కాలికమని చెప్పినా..
ఇటీవల కార్మిక నేతలు విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెడతామని చెప్పారు. దానిని తాము విశ్వసించబోమని అఫిడవిట్లో సునీల్ శర్మ పేర్కొన్నారు. ఒకవేళ వారు డిమాండ్ పక్కన పెట్టినా మళ్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని చెప్పారు. టెంపరరీగా వాయిదావేసి... అదనుచూసి దెబ్బ కొట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసమే వారు విలీనం అంశాన్ని పక్కనపెట్టిన చర్చలు జరపబోమని తేల్చిచెప్పారు.
పండగ సమయంలో
కార్మికులు సమయం చూసి సమ్మెకు వెళ్లారని సునీల్ శర్మ గుర్తుచేశారు. బతుకమ్మ, దసరా సమయంలో స్ట్రైక్ వెళ్లడం పెద్ద తప్పు అన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న కార్పొరేషన్.. మరింత కుంగిపోయిందని చెప్పారు. కార్మికుల సమ్మెతో ఇప్పటికే 44 శాతం నష్టం వచ్చిందని గుర్తుచేశారు. కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చలేమని తెలిపారు.
నేతల స్వార్థంతోనే
ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె వెనక నేతలు, ప్రతిపక్షాలు ఉన్నాయని పరోక్షంగా సునీల్ శర్మ పేర్కొన్నారు. వారి వ్యక్తిగత స్వార్థం కోసం, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. కార్మికుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే 23 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.