TSRTC STRIKE:సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేం, బకాయి వివరాలపై ఆరా, శుక్రవారానికి వాయిదా
టీఎస్ఆర్టీసీ బకాయిలు, సమ్మెకు సంబంధించిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రధానంగా రూ.1099 కోట్ల బకాయి గురించి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించగా, ఆర్టీసీ జేఏసీ నేతల పక్షాన ప్రకాశ్ రెడ్డి వాదనలను బలంగా వినిపించారు. ఆర్టీసీ బకాయిలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. బకాయి వివరాలు, రాయితీలకు సంబంధించి పూర్తి వివరాలను శుక్రవారం లోగా నివేదిక అందజేయాలని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మను ఆదేశించింది.
టీఎస్ఆర్టీసీ సమ్మె, సకల జనుల సభకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం.. హై కోర్టులో పిటిషన్
బకాయిలపై వాదనలు
ఆర్టీసీకి ప్రభుత్వం రూ.1099 కోట్లు బకాయి ఉంది. అయితే ఇందులో 42 శాతం తెలంగాణకు, మిగిలిన 58 శాతం ఏపీకి చెందినదని ఏజీ వాదించారు. ఆర్టీసీ విభజన జరగలేదా ? బకాయిలు ఎప్పటివని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. 2014-15 బడ్జెట్లో బకాయిలు ఎన్ని ఉండే.. 2018-19 బడ్జెట్ సమయంలో ఎంత ఉంది అని ఆరాతీసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏజీ వద్ద లేకపోవడంతో శుక్రవారం లోగా సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
సమ్మె విరమించాలని ఆదేశించలేం..
సమ్మె చట్ట విరుద్ధమని, సమ్మెను నిలిపివేయాలని కూడా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు కార్మికుల పక్షాన నిలిచింది. సమ్మె చట్ట విరుద్ధమని తాము ఆదేశించలేమని పేర్కొంది. కార్మికుల గొంతు కోయలేమని.. హక్కుల కోసం నిరసన చేస్తున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడింది. కార్మికులను సమ్మె విరమింపజేయమని ఆదేశాలు జారీచేయలేమని తెల్చిచెప్పింది. దీంతోపాటు జీహెచ్ఎంసీకి ఇచ్చిన రూ.330 కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో బకాయిలకు సంబంధించి వాదోపవాదనలు జరిగాయి.
వేతనాలపై వాయిదాల పర్వం
ఆర్టీసీ కార్మికుల వేతనాలకు సంబంధించిన పిటిషన్ సింగిల్ బెంచ్ ముందుకు వచ్చింది. కానీ డివిజన్ బెంచ్ వద్ద బకాయిలు, సమ్మెపై విచారణ జరగడంతో ఏజీ అక్కడికి రాలేకపోయారు. మధ్యాహ్నం, సాయంత్రం వరకు చూసి విచారణను వాయిదావేశారు. తొలుత శుక్రవారానికి వాయిదావేస్తామని చెప్పగా.. యాజమాన్యం తరఫున లాయర్లు సోమవారానికి వాయిదా వేయాలని కోరడంతో వాయిదావేశారు. జీతాలు లేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. ఈ అంశంపై బుధవారం హైకోర్టు సీజేను కలిసి విన్నవిస్తామని చెప్పారు. 49 వేల 193 మంది ఉద్యోగులు జీతం కోసం చూస్తున్నారని.. వారి వేతనం వారికి ఇవ్వాలని కోరుతున్నారు.
ఇక పిటిషన్లే పిటిషన్లు
సమ్మె, బకాయి, వేతనాలతోపాటు ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలపై మరో పిటిషన్ వేస్తామని యూనియన్ తరఫు న్యాయవాదులు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో 97 బస్సు డిపోలు, వందల బస్టాండ్లు, వేల కొద్ది షెల్టర్లు ఉన్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్లో ఉన్న బస్సు షెల్టర్ల నుంచి జీహెచ్ఎంసీ పన్ను తీసుకుంటుంది అనే విషయాన్ని గుర్తుచేశారు. అందులోంచి బల్దియా ఆర్టీసీకి ఎందుకు చెల్లించదని ప్రశ్నిస్తున్నారు. వీటిపై కూడా పిటిషన్లు దాఖలు చేస్తామని పేర్కొన్నారు.