TSRTC STRIKE : తెలంగాణా ప్రభుత్వానికి కోర్టు ఇచ్చిన 14 పేజీల ఆర్డర్ కాపీలో ఏముందో తెలుసా ?
ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికే విచారణ జరిపిన ప్రభుత్వం సమ్మె విషయంలో తన ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ పంపించిన హైకోర్టు ఆర్డర్ కాపీ పై అధ్యయనం చేసిన సర్కార్ కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకుంది. అసలు ఇంతకీ హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి పంపిన ఆర్డర్ కాపీలో ఏముంది ? ప్రధానంగా ఏ అంశాలను హైకోర్టు తెలంగాణా ప్రభుత్వం ముందు ఉంచింది. 14పేజీల ఆర్డర్ కాపీలో ఏముంది అన్న ఆసక్తి ఇప్పుడు తెలంగాణా ప్రజల్లో నెలకొంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు పంపిన ఆర్డర్ కాపీలోని అంశాలు మీ కోసం .
TSRTC Strike: సీఎం కేసీఆర్ కీలక సమీక్ష: ఆర్టీసీ సంఘాలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?
చర్చలు జరపాలని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం
నిన్నా మొన్నటి వరకు కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇక ఈ నేపధ్యంలో మంగళవారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి చేరింది. ఇక ఈ ఆదేశాల కాపీలో ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ఇరు వర్గాలు పట్టువిడుపుల ధోరణితో వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది . ఇద్దరూ ఒక మెట్టు దిగాలి. అటు కార్మిక సంఘాలు,ఇటు ప్రభుత్వం మెట్టు దిగకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారు అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జేఏసీ ప్రతినిధులతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీలు చర్చలు జరపాలి అని ఆర్డర్ కాపీలో తెలిపింది . ప్రభుత్వం చర్చల ప్రక్రియను పర్యవేక్షించాలి. చర్చలతోనే ఎలాంటి సమస్యైనా పరిష్కారమవుతుంది అని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆర్డర్ కాపీలో పలు అంశాల ప్రస్తావన
అక్టోబరు 28 నాటికి జరిపే తదుపరి విచారణ సమయానికి చర్చలు ఫలప్రదమై ఆర్టీసీ సమ్మె విరమణ జరుగుతుందని భావిస్తున్నాం అని అభిప్రాయపడింది హైకోర్టు. సమ్మెలోకి వెళ్లిన కార్మిక సంఘాలు లేవనెత్తిన పలు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడి లేవు కాబట్టి వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరపాలి అని పేర్కొంది. అంతే కాదు కార్మికుల సమస్యలపట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి అని హైకోర్టు సూచించింది. ఇక అంతే కాదు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటిని ధర్మాసనం ప్రత్యేకంగా పేర్కొనటం కూడా ఆర్డర్ కాపీలో ఉంది.
1950లోని సెక్షన్ 19(1)(సి) ప్రకారం ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసిన హైకోర్టు
ఆర్థిక అంశాలతో సంబంధం లేని అంశాలను మాత్రమే కాదు ఆర్థిక అంశాలతో ముడిపడిన కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. వాటి విషయంలోనూ వారికి ఇవ్వాల్సిన వాటిని ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా, చట్టపరంగా చెల్లించాల్సిందే అని పేర్కొంది. రాజ్యాంగంలోని 14, 15, 16, 19, 21 అధికరణాల ప్రకారం కార్మికుల డిమాండ్లు ఆమోదించదగినవి అని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్టీసీ చట్టం చట్టం 1950లోని సెక్షన్ 19(1)(సి) ఇతర సెక్షన్ల ప్రకారం ఆర్టీసీ సిబ్బందికి పని చేసేందుకు ఆరోగ్యకర వాతావరణం, తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్ పై ఉంది అని కోర్టు ధర్మాసనం ఆర్డర్ కాపీలో ఉటంకించింది.
28న కోర్టు విచారణ సమయానికి సానుకూల సమాచారం ఇస్తారని ఆశాభావం
రాష్ట్రంలోని ఆర్టీసీలో పని చేస్తున్న కుటుంబాలను , మహిళలు,పిల్లలను దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా చర్చలు జరపాలని ఆదేశిస్తున్నాం అని కోర్టు పేర్కొంది. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలపై సానుకూల సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం అని ఆశాభావం వ్యక్తం చేసింది. కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించే నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు ఈ ఆర్డర్ కాపీలో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసింది.
సామాన్య ప్రజల కోసమే ఈ నిర్ణయం అన్న హైకోర్టు ధర్మాసనం
కోర్టు తన న్యాయ పరిధికి లోబడి ఉంది. అందుకే యూనియన్ జేఏసీల డిమాండ్లను పరిష్కరించాలని, తెలంగాణా రాష్ట్రానికి గానీ కార్పొరేషన్ కు గానీ ఆదేశాలు ఇవ్వడం లేదు. కేవలం సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం అని హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా పలు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ ఆర్డర్ కాపీని పంపించింది. ఇది అందుకున్న ప్రభుత్వం చర్చలకు కమిటీ వేసింది.