టీఎస్ఆర్టీసీ సమ్మె, కార్మికులకు మరో ఎదురు దెబ్బ... ప్రైవేట్ రూట్లపై కోర్టు కీలక వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే కార్మిక సంఘాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూట్లను ప్రైవేట్పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర మోటారువాహన చట్టం ప్రకారం ఆర్టీసీ, మరియు ప్రైవేట్ రవాణా వ్యవస్థలను నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు తెలిపింది. ప్రైవేట్ రూట్లపై మంగళవారం కోర్టులో ఇరువర్గాలు వాదనలు కొనసాగిన సంధర్భంలో... కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేయగా.... వాదనలు విన్న అనంతరం బుధవారానికి వాయిదా వేసింది.
5100 రూట్ల ప్రవైటీకరణ
సమ్మెతో డోలాయమానంలో ఉన్న కార్మికులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ రవాణాలో సేవలు అందిస్తున్న బస్సుల్లో యాబై శాతం మేర ప్రైవేట్ బస్సులను తిప్పాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీంతో ముప్పై శాతం మేర ప్రైవేట్ బస్సలతోపాటు మరో ఇరవై శాతం మేర అద్దె బస్సులను కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేసిన ప్రభుత్వం , క్యాబినెట్లో చర్చించిన తర్వాత దానికి అమోద ముద్ర వేశారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 5100 రూట్లను ప్రైవేట్పరం చేయాలని నిర్ణయించారు.
ప్రైవేట్ రూట్లపై ప్రత్యేక పిల్
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రోఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు పిల్ వేసిన నేపథ్యంలోనే విచారిస్తున్న హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఆర్టీసీ తోపాటు సమానంగా ప్రైవేట్ వ్యవస్థను నడిపే హక్కు కేంద్ర మోటారు వాహన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో తప్పేముందని పిటిషనర్ను ప్రశ్నించింది. అయితే రవాణా చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం ఏ మార్పు చేసిన వాటి సమాచారాన్ని ఆర్టీసీకి తెలుపాలనే అంశాన్ని పటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేవనెత్తారు. కాని, ఆయన వాదనతో కోర్టు ఏకిభవించలేదు.
ప్రైవేట్ ఎయిర్లైన్స్ విజయవంతం కాలేదా...?
ఈ నేపథ్యంలోనే పిటిషనర్ చెబుతున్నట్టుగా సెక్షన్ 102లో ఏముందో .. దాని ప్రకారం ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించాల్సిన ప్రక్రియ ఏమిటో కోర్టుకు వివరించాలని సూచించింది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతుందా అంటూ ప్రశ్నించింది. దీంతోపాటు ప్రపంచంలో జరుగుతున్న ప్రైవేటీకరణ అంశాలను ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి ఎయిర్లైన్స్ వ్యవస్థను ఉదహారణగా చూపింది. గతంలో ఒక్క ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేదని ... దానికి దీటుగా ప్రైవేట్ ఎయిర్లైన్స్ కొనసాగుతూ విజయవంతం అవుతున్న అంశాన్ని ప్రస్తావించింది.
జేఏసీ కీలక భేటి
ఇక సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు బదలాయించాలనే కోర్టు ఉత్తర్వులు వెలువరించడంతో జేఏసీ నేతలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ప్రైవేటీకరణ అంశంతో పాటు మరోవైపు లేబర్ కోర్టుకు విషయం వెళుతుండడంతో మరింత ఆలస్యం అయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై చర్చించేందుకు జేఏసీ నేతలు కీలక భేటి నిర్వహించారు. దీంతో సమ్మె విరమించాలనే నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నట్టు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ సమ్మె వరమిస్తే... ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తంది..... కార్మికులను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా లేదా అనే అంశాలపై కూడ చర్చిన్నట్టు తెలుస్తోంది.