ఆర్టీసి సమ్మెకు బ్రేక్..! భేషరతుగా ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అశ్వథ్థామ రెడ్డి డిమాండ్..!!
హైదరాబాద్ : తెలంగాణ కార్మికులు తలపెట్టిన సమ్మె ముగిసింది. 47రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరూతూ ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతూనే పలు రూపాల్లో నిరసన తెలిపారు. అంతే కాకుండా దాదాపు 27మంది కార్మికులు ఉద్యోగాల పట్ల అభద్రతా భావంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ప్రభుత్వం నుండి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ఎలాంటి సానుకూల స్పందన లేకుండా పోవడం, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్టుదలగా ఉండడంతో కార్మికులు మెట్టుదిగక తప్పలేదు. ఐతే ప్రభుత్వం తరుపున న్యాయం జరగక పోయినా న్యాయస్ధానం తమకు న్యాయం చేస్తుందని బావించిన కార్మికులకు ఎదురుదెబ్బ తగిలింది.
సమ్మెకు బ్రేక్..
కార్మికుల పట్ల, కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం లేదని తెలంగాణ హోకోర్ట్ పలు సందర్బాల్లో వాదించింది. అంతే కాకుండా, సంస్ధకు చెల్లించాల్సిన నిధుల అంశంలో తప్పుడు నివేదికలు సమర్పించిందని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని కోర్ట్ మందలించింది కూడా. ఈ పరిణామాలన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసి జేఏసీ నేతలు తమకు ప్రభుత్వం న్యాయం చేయక పోయినా కోర్టు న్యయం చేస్తుందని బలంగా విశ్వసించారు. సమ్మెను కూడా అంతే ఉదృతంగా నిర్వహించారు. తర్వాత గత సోమవారం కోర్టు విచారణలో సమ్మె కోర్టు పరిధిలోకి రాదని, లేబర్ కమీషనర్ ఈ సమస్యను రెండు వారాల్లో పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్ట్. దీంతో సమ్మె చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
లేబర్ కోర్టులోకి ఉద్యోగుల పంచాయతి..
లేబర్ కమీషన్ పరిధిలోకి సమ్మె అంశం వెళ్తే ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తం చేసారు జేఏసీ నేతలు. సమ్మె కొనసాగింపు పట్ల ముందుగా తెలంగాణలోని అన్ని డిపోల కార్మికులతో చర్చలు జరిపి తమ అభిప్రాయాలను సేకరించారు జేఏసీ నేతలు. మెజారిటీ కార్మికులు సమ్మె కొనసాగింపుకే మొగ్గు చూపారు. చివరగా న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన జేఏసి నాయకులు సమ్మె విరమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 47 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల జీవితాలు దుర్బరంగా మారాయని, న్యాయ స్దానం నుంచి ఏదో ఒక సానుకూల నిర్ణయం వస్తుందని భావించారు కార్మికులు. సమ్మె అంశం, కార్మికులు డిమాండ్లు లేబర్ కమీషనర్ పరిధిలో పరిష్కరించుకోవాలని సూచించడంతో కార్మిక లోకం అయోమయంలో పడింది.
న్యాయ నిపుణుల సలహాతో సమ్మె విరమణ..
న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్టు జేఏసి కన్వీనర్ అశ్వథ్తామ రెడ్డి ప్రకటించారు. 47 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న కార్మికులకు ఎలాంటి షరతులు విధించకుండా విధుల్లోకి తీసుకోవాలని అశ్వథ్తామ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. యూనియన్లలో కొనసాగరాదనే నిబంధనలు విధించరాదని, ఎలాంటి బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకోకుండా విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాకుండా కోర్టు తీర్పు పట్ల తమకు అపార గౌరవం ఉందని, లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే అబిప్రాయాన్ని అశ్వథ్తామ రెడ్డి వ్యక్తం చేసారు.
బంతి మళ్లీ కేసీఆర్ కోర్టులోకే..
ఆర్టీసి కార్మికుల సమ్మె ముగింపు ప్రకటన తర్వాత అందరి దృష్టి ఇప్పుడు సీఎం చంద్రశేఖర్ రావు చర్యలపైనే కేంద్రీకృతమైంది. సెల్ప్ డిస్మిస్ అయ్యారని ప్రకటించిన చంద్రశేఖర్ రావు ఉద్యోగులను మళ్లీ భేషరతుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గతంలో ఆర్టీసి ఉద్యోగుల సమ్మె ఓ ముగిసి అధ్యాయమని పేర్కొన్న చంద్రశేఖర్ రావు అదే కట్టబడి ఉంటారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది, గతంలో సమ్మెలో పాల్గొన్న కార్మికులు భేషరతుగా తమ ఉద్యోగాల్లో చేరి పోవాలని రెండు సార్లు డెడ్ లైన్ విధించిన చంద్రశేఖర్ రావు పిలుపును కార్మికులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ బంతి సీఎం చంద్రశేఖర్ రావు కోర్టులోకే వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.