తెలంగాణలో జై జగన్ నినాదాలు: కేసీఆర్ కు వ్యతిరేకంగా: అన్ని పార్టీలదీ అదే దారి..!
తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ పెరుగుతోంది. తెలంగాణ కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా..ఏపీ ముఖ్యమంత్రికి అనుకూలంగా కొద్ది రోజులుగా రోడ్లపైన నినాదాలు మార్మోగుతున్నాయి. చివరకు జగన్ ను కొద్ది కాలం క్రితం వరకు వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు..నేతలు సైతం ఇప్పుడు జగన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నాయి. జగన్ ను చూసి నేర్చుకోవాల ని తెలంగాణ ముఖ్యమంత్రికి సూచిస్తున్నాయి.
తాజాగా, తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో ఇప్పుడు తొలి సారి ముఖ్యమంత్రి అయిన జగన్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోటీగా మారారు. జగన్ అమలు చేస్తున్న నిర్ణయం మీరెందుకు చేయలేరంటూ ఆర్టీసీ కార్మికులతో పాటుగా..రాజకీయ నేతలు ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. ఇక, తాజాగా ఆర్టీసీ కార్మికులు వికారాబాద్ లో చేపట్టిన నిరసన ర్యాలీలో జగన్ కు అనుకూలంగా..కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం చేతికి పోలవరం!? జగన్ కు కాదు..ఆ ఇమేజ్ మనకే దక్కాలి: బీజేపీ కొత్త ఎత్తుగడ..!
ఏపీలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
జగన్ తన పాదయాత్ర సమయంలో అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రబుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపైన అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసారు. కమటీ నివేదిక ఆదారంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సాంకేతిక అంశాలు అడ్డుగా ఉండటంతో..ఆర్టీసీ ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలోని ప్రజా రవాణా ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారికి జనవరి 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా జీతాలు అందనున్నాయి. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సమస్యగా మారింది. అయితే, తాము అటువంటి హామీలు ఇవ్వలేదని చెబుతూ..ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సమస్యే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. కానీ, కార్మిక సంఘాలు మాత్రం ఈ విషయంలో పట్టు వీడటం లేదు.
జగన్..కేసీఆర్ పైన కార్మికులు ఇలా..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన హామీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేయలేరంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లోని ఆర్టీసీ గురించి ప్రస్తావిస్తున్నారు కానీ, ఏపీలో ఆర్టీసీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీస్తున్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం కార్మిక సంఘాల డిమాండ్ల మీద ససేమిరా అంటున్నారు. అదే సమయంలో ఏపీ విషయం గురించి ప్రస్తావించటానికి మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో..తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటుగా అక్కడి రాజకీయ పార్టీల నేతలు సతైం జగన్ ను ప్రశంసిస్తూ కేసీఆర్ పైన విమర్శలు చేస్తున్నారు. గతంలో జగన్ పైన విమర్శలు చేసిన నేతలు సైతం ఇందులో ఉన్నారు.
నిరసన ర్యాలీల్లో జై జగన్ నినాదాలు..
తాజాగా వికారాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ నిర్వహించాయి. అందులో ఆంధ్రా సీఎం అచ్చా అంటూ...తెలంగాణ సీఎం పైన వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇదే రకంగా కార్మిక సంఘాల సమావేశాల్లోనూ ఏపీలో ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారనే అంశం మీద చర్చ సాగుతోంది. అక్కడ కూడా ఆర్టీసీ నష్టాల్లోనే ఉందని.. అయినా ప్రభుత్వం ముందుకు వచ్చిందని విశ్లేషణలు చేస్తున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ ప్రభుత్వ నిర్ణయం వెనుక లాభ నష్టాల గురించి బయటకు మాట్లాడలేని ఇరకాటంలో పడిపోయింది.