తలసాని సహా వారిపై ఫిర్యాదు, తెలంగాణ 'ప్రత్యేక' రాష్ట్రమా?: టీడీపీ
హైదరాబాద్: తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం నాడు సభాపతి మధుసూదనాచారిని కలిశారు. స్పీకర్ను వారు ఆయన నివాసంలో కలిశారు.
ఆయనకు వినతిపత్రం అందించారు. స్పీకర్ను కలిసిన వారిలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, తెలంగాణ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా భావిస్తున్నట్లు కనబడుతోందని మండిపడ్డారు. సభాపతి దృష్టి పెట్టకపోవడంతో కేసీఆర్ రాజకీయ రాబందులా మారి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. తమ పార్టీ టిక్కెట్ పైన గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో మంత్రిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా: పోచారం
తెలంగాణ రాష్ట్రంలో జరిగే తొలి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి, పోచంపాడులోని పుష్కరఘాట్లను ఆయన పరిశీలించారు. ఈ నెలఖరులోగా పుష్కరాల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామన్నారు.