శంకుస్థాపనకు వెళ్లనున్న టీటీడీపీ నేతలు, పవిత్ర జలాలను తీసుకెళ్లిన ఎంపీ
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ తెలుగుదేశం నేతలు హాజరుకానున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ మహాకార్యాన్ని కళ్లారా చూడాలని వారంతా ఈనెల 22న అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.
రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలకు చంద్రబాబు నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఇందులో భాగంగా రాజధాని అమరావతి కోసం మన మట్టి-మన నీరు కార్యక్రమం కోసం ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి ఇప్పటికే మట్టి, నీరు కూడా సేకరించారు.
అమరావతికి తెలంగాణ పవిత్ర జలాలు: ఎంపీ మల్లారెడ్డి
తెలంగాణలో సేకరించిన పవిత్ర జలాలు, మట్టిని నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ మల్లారెడ్డి మంగళవారం తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు వద్ద ఆయనకు ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య స్వాగతం పలికారు.
రాజధాని శంకుస్థాపన కోసం ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి నీరు, మట్టిని సేకరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ నుంచి కూడా పవిత్ర జలాలను, మట్టిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తెలంగాణ నుంచి సేకరించిన మట్టి, జలాలను ఎంపీ మల్లారెడ్డి తీసుకెళ్లారు.
షిరిడీ నుంచి అమరావతికి మట్టి, నీరు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం పవిత్ర పుణ్యక్షేత్రం షిర్డీ నుంచి మట్టి-నీరును అమరావతికి తరలించారు. షిర్డీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మట్టి-నీరుకు సాయిబాబా ఆలయంలో టీడీపీ నేత మండవ రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ మట్టి-నీరుని విజయవాడకు తరలించారు.