టీఆర్ఎస్ కు ఓటెయ్యకుంటే కుక్కలు కూడా చూడవా ? నిన్న ఎర్రబెల్లి నేడు తుమ్మల జులుం
Recommended Video
టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు నేతలకు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలని తప్పుబడుతున్నారు నేతలు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయని ఖమ్మం జిల్లా ప్రజలను దుర్భాషలాడుతున్నారు. నిన్నటికి నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని, ఈసారి ఎన్నికల్లో అయినా తప్పు దిద్దుకోవాలని ప్రజలను తప్పు పడితే, ఇక తాజాగా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే ప్రజలను కుక్కలు కూడా పట్టించుకోవడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నన్ను ఓడించినట్టే నామాను ఓడిస్తే మీ గతి కుక్కలు కూడా చూడవు అన్న తుమ్మల
నేలకొండపల్లి లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు లో మీరు వేసే ఓట్లు మురిగి మురుగు కాలవలో కొట్టుకుపోయాయని, నన్ను ఓడించటం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి అని ప్రజల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు లోక్ సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికల బరిలో ఉన్నాడని నాకు జరిగినట్టే నామాకు జరిగితే మీ గతి కుక్కలు కూడా చూడవని ఇష్టం వచ్చినట్టు ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ప్రజలు తప్పు చేశారట .. ఓడిపోయిన అసహనం ప్రదర్శించిన తుమ్మల
అంతే కాదు 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో తుమ్మల అంత చిన్నతనంగా ఫీల్ అయిన సందర్భాలు లేవట. అతను ఓటమి అంటే ఎదో ఎరుగని నాయకుడు లాగా ఇప్పుడే మొదటిసారి ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల ఓడిపోయినట్టుగా తుమ్మల మాట్లాడిన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రజల ఆశలు, కోరికలు నెరవేర్చే ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించాలని, ఇప్పటి వరకూ జరిగిన పొరపాట్లను మరచి అందరూ నామా నాగేశ్వర్ రావును గెలిపించాలని ప్రచార సభలో మాట్లాడిన తుమ్మల, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారంతా కాంగ్రెస్ నేతలు సైతం గులాబీ గూటికి చేరడంతో ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పుకొచ్చారు . అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అసహనాన్ని అంతా ప్రజల ముందు ప్రదర్శించి, వారిపైన తుమ్మల మండి పడిన తీరు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.
ప్రజా తీర్పును అవహేళన చేసిన మంత్రి ఎర్రబెల్లి .. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నేతలు
ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం ప్రజలు తప్పు చేశారని, ఈ ఎన్నికల్లో అయినా తప్పు దిద్దుకోవాలని చెప్పి ప్రజా తీర్పు పై అవహేళన చేస్తే, తుమ్మల టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే కుక్కలు కూడా చూడవు అంటూ చాలా అవమానకరమైన రీతిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నేతల అహంకార ధోరణి, ప్రజలను బెదిరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది .
డిక్టేటర్ మినిస్టర్ ఎర్రబెల్లి .. ప్రజలకు, ప్రతిపక్షాలకు వార్నింగ్ లు ఇస్తూ హల్ చల్
బెరిదించటం , డిక్టేట్ చెయ్యటం ఇవి మాత్రమే ఆయుధాలుగా ఎన్నికల ప్రచారం
ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అనేది ఓటర్ల నిర్ణయం. ఒక అభ్యర్థిని గెలిపించ లేదు అంటే ఓటర్లకు సవాలక్ష కారణాలు ఉంటాయి. అంతమాత్రాన ఓటర్లందరూ తీసుకున్న నిర్ణయం తప్పని, తమ పార్టీకి ఓటు వేయకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని బెదిరింపులకు పాల్పడినట్లుగా అధికార పార్టీ నేతలు మాట్లాడటం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నియంతృత్వ విధానానికి నిదర్శనంగా భావించాలన్నది ప్రతిపక్షాల భావన .
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం ఎన్నికల సమయంలో ఎవరికి ఓటు వేయాలో డిక్టేట్ చేశారు. అంతేకాదు నేను మంత్రిని, రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నేనే మంత్రి ని, మీ పింఛన్లు, రుణాలు అన్ని ఇవ్వాల్సింది నేనే. అంటూ టిఆర్ఎస్ కు ఓటు వేయకుంటే మీకు రావలసినవి రావు. మీ గ్రామాలు అభివృద్ధి చెందవు అన్న ధోరణిలో మాట్లాడటం అధికారం చేతిలో ఉంది కాబట్టి బెదిరించడం అని ప్రతిపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునే మార్గం ... బెదిరింపులా .. హెచ్చరికలా ?
ప్రజలు సైతం వీరు మాట్లాడుతున్న మాటలు పట్ల, చేస్తున్న వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు.ఎవరికైనా ఓటు కావాలంటే ఓటర్లను అభ్యర్థిస్తారు. బతిమాలి బామాలి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ గులాబి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలను అవమానించేలా అహంకార ధోరణి లో అవాకులు చెవాకులు పేలుతున్నాడు. మీరు ఎవరికి ఓటేసినా , వారంతా టిఆర్ఎస్ పార్టీలో చేరుతారంటూ వేరే ఎవరికి ఓటు వేసిన మీరు వేసే ఓటు మురికి మురుగు కాలువలో పడుతుందంటూ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలోని తాజా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని, స్వతంత్ర అభ్యర్ధుల గెలిపించిన ప్రజలు వారు తిరిగి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇక అలాంటి చోట టీఆర్ఎస్ నేతల మాటలు పుండు మీద కారం చల్లినట్లు గా ఉన్నాయి. ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్య యుతమైన ప్రచారంలా లేదని, నేతల తీరు పార్టీకి చేటు చేస్తుందని రాజకీయ విశ్లేషకుల భావన.