ఏపీ సర్కార్ 'చిల్లర రాజకీయాలు' : తుమ్మల, ఆ కంపెనీలకు 'వాటర్ కట్' చేయండి : రేవంత్
ఖమ్మం : ఆగ్రహావేశాలకు దూరంగా.. ఎప్పుడూ ఆచి తూచి స్పందించే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ ప్రభుత్వ చర్యల పట్ల మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ఘాటుగా స్పందించారు తుమ్మల.
కృష్ణా నదిపై పాలమూరు డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఏపీ సర్కార్ కృష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారా.. అంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కేంద్రం అండ చూసుకుని ఏపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తుమ్మల, ఏపీ రాజకీయాల కోసం తెలంగాణను ఇబ్బందులపాలు చేయవద్దంటు సూచించారు. 'మీ చిల్లర రాజకీయాల కోసం మా ప్రాజెక్టులకు అడ్డుతగులుతామంటే కుదరదని..' హెచ్చరించారు.
మద్యం కంపెనీలకు 'వాటర్ కట్' చేయండి : రేవంత్
హైదరాబాద్ : నగరంలో తాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతుంటే, మధ్య తయారీ కంపెనీలకు మాత్రం నీటి సరఫరా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని పేర్కొంటూ మద్యం కంపెనీలకు నీటి సరఫరాను నిలిపివేయాలనిహైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రేవంత్.
మద్యం వల్ల జరిగే అనార్థాల గురించి పిటిషన్ లో ప్రస్తావించిన రేవంత్, మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. కాగా, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వాటర్ బోర్టు, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది.
నీటి సరఫరాపై వివరణ ఇస్తూ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.