కెసిఆర్ వ్యూహం: హైదరాబాదు జిహెచ్ఎంసి ఎన్నికల్లో తుమ్మల పాచిక?
హైదరాబాద్: హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి మరో సంఘటన ముందుకు వచ్చింది. హైదరాబాదులోని ఆంద్ర సెటిలర్లను తన వైపు తిప్పుకోవడానికి ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును పాచికగా వాడాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
సోమవారం శేరిలింగంపల్లిలో జరిగిన సభలో కెటి రామారావుతో పాటు తుమ్మల నాగేశ్వర రావు కూడా పాల్గొనడాన్ని బట్టి ఆ విషయం తెలిసి వస్తోంది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావును టిఆర్ఎస్లో చేర్చుకుని కెసిఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. తుమ్మల సామాజిక వర్గానికి చెందిన సెటిలర్లే హైదరాబాదులో ఎక్కువగా ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి విజయం సాధించడం, గతంలో కూకట్పల్లి శానససభ నియోజకవర్గం నుంచి జయప్రకాశ్ నారాయణ విజయం సాధించడం ఆ సామాజిక వర్గం కారణమనే అభిప్రాయం ఉంది.
ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వర రావు ద్వారా ఆ సామాజిక వర్గాన్ని వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి దగ్గర చేసుకోవాలనే వ్యూహంతో కెసిఆర్ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదు నగరపాలక సంస్థలో విజయం సాధించడానికి తన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కెసిఆర్ పావులు కదుపుతూనే ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుంచి హైదరాబాద్, దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో గెలిచినవారిని ఆయన టిఆర్ఎస్లో చేర్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస యాదవ్ను పార్టీలో చేర్చుకుని, ఆయన రాజీనామా కూడా ఆమోదం పొందకుండానే ఆయనకు మంత్రిపదవిని ఇచ్చారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల కోసమే కెసిఆర్ ఆ పని చేశారనే మాటలో వాస్తవం లేకపోలేదు. తుమ్మల నాగేశ్వర రావును మరోవైపు నుంచి నరుక్కు రావడానికి హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వాడుకోనున్నట్లు అర్థమవుతోంది.