డబ్బులిచ్చింది రేవంత్ రెడ్డి బొమ్మనా, రోబోనా: ఘాటుగా తుమ్మల
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో దొంగలు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత దొంగలదేనని తెలిపారు. నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు డబ్బులిచ్చింది రేవంత్రెడ్డా? ఆయన బొమ్మనా? రోబోనా? అని ప్రశ్నించారు. దొంగలు దొరికింది ఏసీబీకి అని ఈ కేసుతో ప్రభుత్వానికి సంబంధంలేదని స్పష్టం చేశారు.
ఏసీబీ విచారణ జరిపి నిజాలు భయటపెడుతుందని ఆయన గురువారం మీడియాతో అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో చెబితే తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు బయట గంగిరెద్దుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యవహారం మొగున్ని కొట్టి మొగసాలకెక్కిన చందంగా ఉందని అన్నారు. టీడీపీ నేతలు తప్పుల మీద తప్పులు చేసి అపహాస్యం పాలవుతున్నారని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ అధినేతలను అవమానపరచడం చాలా తప్పని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రులపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు 9 నెలలుగా నిద్రపోతున్నారా? అని నిలదీశారు. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ ప్రభుత్వమైనా కేసీఆర్పై ఒకే రకమైన కేసులు పెట్టిస్తుందా? అని ప్రశ్నించారు.
ఆంధ్రా ప్రభుత్వానికి హైదరాబాద్లో పరిపాలనాపరమైన వెసులుబాటు మాత్రమే ఉందని పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసుకునే అధికారం లేదని వివరించారు. ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. దొంగెవరో తెలిసిన తర్వాత దాక్కొవాలనుకోవడం వాళ్ల తెలివిదక్కువతనమని దుయ్యబట్టారు. ఇంత తెలివి తక్కువ తనంగా వ్యవహరిస్తున్నారా అని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.