తెలంగాణపై పెత్తనమా: చంద్రబాబుపై తుమ్మల, దగుల్బాజీ అంటూ జూపల్లి
ఖమ్మం/ మహబూబ్నగర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి హక్కులు ఉంటాయనుకోవడం అవివేకమని, తెలంగాణపై పెత్తనం చేయాలనుకోవడం దుర్మార్గమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి లేఖ రాయడంపై తుమ్మల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో పబ్బం గడుపుతోందని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పట్టిసీమ ఎలా కడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. అది రాజ్యాంగ విరుద్ధం కాదా అని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టుకు 2013లోనే ప్రభుత్వ అనుమతులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ పరిశ్రమ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ టీడీపీ నేతకు నిజాయితీ ఉంటే చంద్రబాబు చర్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలు సాగు అవుతుందన్నారు. ఎత్తిపోతల పథకంపై పాలమూరు టీడీపీ నేతల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం హయాంలో పాలమూరు జిల్లాకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. డికె అరుణ, టీడీపీ నేతలు ఒకే తానులోను ముక్కలు అన్నారు. బీమా ప్రాజెక్టుకు చంద్రబాబు రూపాయి ఖర్చు చేశాడని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు.