పిల్లనిచ్చిన మామకే, రాహుల్ మాటేమిటి: కాంగ్రెస్ను దులిపేస్తే బాబుకు కేటీఆర్ షాక్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పైన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం దుమ్మెత్తిపోశారు. అధికారం కోసం తాము అర్రులు చాచడం లేదని, అధికారాన్ని వదులుకొని ఎన్నికలకు వెళ్తున్నామని అభిప్రాయపడుతూ.. అధికారం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వాళ్లు ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తుంగతుర్తి నేతలు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
Recommended Video
సంచలనం: ముందస్తుకే కేసీఆర్, సెప్టెంబర్లో అసెంబ్లీ రద్దు? వారికి టిక్కెట్లు నో, వరాల వర్షం
తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు అంటే విపక్ష నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్న వాళ్లు పదవులు వదిలిపెట్టేందుకు భయపడతారని, కానీ తెరాస అందుకు భిన్నమని చెప్పారు. అధికారం కోసం పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వాళ్లు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
కేసీఆర్ను గజ్వెల్లోనే ఓడిస్తామంటారు కానీ
కాంగ్రెస్ నేతలవి అన్నీ ప్రగల్భాలేనని కేటీఆర్ అన్నారు. సీఎం అద్భుతంగా పని చేస్తున్నారని ప్రతిపక్షాలే కితాబిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనను ప్రధాని మోడీయే స్వయంగా పార్లమెంటులో మెచ్చుకున్నారని చెప్పారు. కేసీఆర్ను గజ్వెల్లో ఓడిస్తామని పెద్దపెద్ద మాటలు చెబుతారని కానీ ఎన్నికలకు భయపడుతున్నారన్నారు. కేసీఆర్కు అద్భుతమైన పరిణితి ఉందని మోడీ చెప్పారన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీలపై
కిరణ్ కుమార్ రెడ్డి తమ చిత్తూరు జిల్లాకు వేల కోట్లు తీసుకెళ్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. కానీ మాకూ నీరు కావాలని అడగలేదన్నారు. ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వనని కిరణ్ అన్నప్పుడు వీరేం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పదిసార్లు అవకాశమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబ పాలనపై మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. సంచులతో డబ్పులు పంచడం కాంగ్రెస్ నేతలకే తెలుసునని చెప్పారు. ఎన్నికల సమయంలో నోట్ల కట్టలతో ఎవరు దొరికారో అందరికీ తెలుసునని అన్నారు.
నేను బచ్చా అయితే రాహుల్ గాంధీ మాటేమిటి
ఏ ఉప ఎన్నికలు వచ్చినా ప్రజలు తెరాసను అధిక మెజార్టీతో గెలిపించారని చెప్పారు. ఎన్నో ఉప ఎన్నికల్లో తెరాస సత్తా చాటిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాసకే పట్టం కడతారని చెప్పారు. కేసీఆర్ గురించి కాంగ్రెస్ నేతలు తక్కువగా అంచనా వేశారన్నారు. నన్ను బచ్చాగాడని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, మరి నేను బచ్చా అయితే రాహుల్ గాంధీ ఏమిటన్నారు. తనకు 42 ఏళ్లు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లానని, రాహుల్ గాంధీ ఏ ఉద్యమంలో పాల్గొన్నాడని ప్రశ్నించారు. 2006 నుంచి 2014 వరకు ఉద్యమంలో ఉన్నానని చెప్పారు. ప్రజలు గెలిపిస్తేనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. బ్లాక్ మెయిల్ చేసి బతికేవాళ్లు కేసీఆర్ను విమర్శిస్తున్నారన్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాట
జాతీయ పార్టీ అంటే ఒకేరకంగా మాట్లాడాలని, ఎక్కడైనా ఒకే విధంగా మాట్లాడాలని కేటీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం తమిళనాడులో ఓమాట, పంజాబ్లో మరో మాట, ఏపీలో ఇంకో మాట మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను ఇందిరా గాంధీ, సోనియా గాంధీ.. ఇబ్బందులు పెట్టారని చరిత్ర చెప్పారు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పని తీరుకు ఆకర్షితులై స్వచ్చంధంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఎందరో ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో తుంగతుర్తికి చెందిన పలువురు నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.